నయీంనగర్: హనుమకొండ అశోక టాకీస్ ఎదురుగా ఉన్న 8వ డివిజన్ మున్సిపల్ స్థలంలో రూ.15 కోట్ల మున్సిపల్ ఎస్పీవీ నిధులతో నిర్మించనున్న మల్టీ లెవల్ సైంటిఫిక్ పార్కింగ్ సముదాయానికి బుధవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నాలుగు అంతస్తులతో నిర్మించనున్న ఈ ఆధునిక పార్కింగ్లో ఒకేసారి 100 కార్లు, 100 టూవీలర్లు పార్క్ చేసే సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. నగర ట్రాఫిక్ సమస్యకు ఈ పార్కింగ్ కాంప్లెక్స్ శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందన్నారు. పనులను నాణ్యతతో, నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, కార్పొరేటర్ బైరి లక్ష్మి ఉన్నారు.


