వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. గ్రీవెన్స్ సెల్ను సద్వినియోగం చేసుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా నేటి సోమవారం నుంచి ఇకపై ప్రతీ వారం డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ప్రజా సమస్యల పరిష్కారానికి వినతులు స్వీకరించేందుకు ఆర్డీఓ ఆఫీస్లో ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పరకాల, హనుమకొండ ఆర్డీఓ కార్యాలయాల్లో సోమవారం వినతులు స్వీకరించనున్నట్లు, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
వరంగల్ కలెక్టరేట్లో..
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యల పరిష్కారానికి వినతులు అందించాలని కోరారు. కాగా, ప్రతీ సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
హన్మకొండ: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతోందని, ఈ క్రమంలోనే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవాలని జీఓ జారీ చేసిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకునేందుకు జారీ చేసిన జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూ.13 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెట్ బకాయిలు ఉన్నాయన్నారు. వరంగల్ ఉద్యమాల వేదిక అని, తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిందన్నారు. రైతు సదస్సు తర్వాత మిగిలిన డిక్లరేషన్లపై పోరాడుతామన్నారు. కామారెడ్డిలో బీసీ సదస్సు, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సదస్సు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. వరంగల్లో ఒక ఆర్టీసీ ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించిందన్నారు. ప్రఽభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, విద్యార్థి సంఘం నాయకులు బైరపాక ప్రశాంత్, గండ్రకోట రాకేశ్యాదవ్, పస్తం అనిల్ కుమార్, రాజేశ్నాయక్, వివేక్, శ్యాంకుమార్ పాల్గొన్నారు.


