నీట్‌ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు | - | Sakshi
Sakshi News home page

నీట్‌ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

May 3 2026 7:17 AM | Updated on May 3 2026 7:17 AM

నీట్‌ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ క్రైం: నీట్‌ ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. జిల్లా పరిధి పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణలో భాగంగా సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ (144 సెక్షన్‌) అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 11 పరీక్ష కేంద్రాల్లో హనుమకొండలో 4, వరంగల్‌లో 2, కాజీపేటలో 3, జనగామలో 2 కేంద్రాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు, పరీక్ష సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

నిబంధనలు ఇలా..

పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు గుమిగూడరాదు.

సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిషేధం.

పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధి అన్ని జిరాక్స్‌ కేంద్రాలు ఈనెల 3న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలి.

ఎవరైనా ఈ ఉత్తర్వులు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement