హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు గురువారం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం పూర్ణాహుతి, బలిహరణ, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగించారు. దేవాలయం చుట్టూ అమ్మవారి ఊరేగింపు జరపడానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి విరాళంగా అందజేయనున్న కోటి రూపాయలతో 30 అడుగుల రథం తయారీకి ఉపయోగించే కలపకు పూజలు చేశారు. శిల్పి గిర్మాజీ ప్రవీణ్ ఆధ్వర్యంలో నాగపూర్ నుంచి తెప్పించిన మేలు రకం టేకు కలపకు అర్చకులు పూజలు చేసి పని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, శ్రవణ్కుమార్, పూర్ణచందర్, వెంకటేశ్వర్లు, సతీశ్, అంజనేయులు, శ్రీనివాస్, శ్రీనివాసారావు పాల్గొన్నారు.
అమ్మవారికి పుష్పయాగం
అమ్మవారికి శతఘటాభిషేకం జరిపి రాత్రి స్నపనమందిరంలో అమ్మవారికి వేదపండితులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా రంగురంగుల పూలతో ఘనంగా పుష్పయాగం నిర్వహించారు.
భద్రకాళి ఆలయంలో
ముగిసిన కల్యాణ బ్రహ్మోత్సవాలు


