హన్మకొండ అర్బన్: ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో కబ్జాకు గురైన అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు వెంకటాపూర్ గ్రామ రైతులు, పేదలతో కలిసి హనుమకొండ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో అనేక చోట్ల అసైన్డ్ భూములు భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకుంటే సీపీఐ ఆధ్వర్యంలో భూ పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


