రేపు తిరుగువారం పండుగ
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క, సారలమ్మకు ఈనెల 4న (బుధవారం) తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మహాజాతర ప్రారంభమైన వారం రోజుల అనంతరం అమ్మవార్లకు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పూజారులు ఆలయాలను శుద్ధి చేసి ధూపదీపాలు వెలిగించి యాటను నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహించనున్నారు. తిరుగువారం రోజున పూజారుల కుటుంబీకులు, స్థానిక ఆదివాసీలు, గిరిజనేతరులు అమ్మవార్ల ఆలయాలకు వచ్చి మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం పూజా సామగ్రి, వస్త్రాలను ఆలయాల్లో భద్రపర్చనున్నారు. తిరుగువారం పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయి. అంతేకాకుండా ఈనెల 8న (ఆదివారం) జాతర విజయవంతమైన సందర్భంగా పూజారులు, గ్రామస్తులు వనభోజనాలకు వెళ్లి అమ్మవార్లకు పూజలు నిర్వహించనున్నారు.
హుండీల తరలింపు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతర హుండీలను లెక్కింపు కోసం దేవాదాయ శాఖ అధికారులు హనుమకొండకు తరలించారు. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఈనెల 5 నుంచి హుండీల్లోని కానుకలు లెక్కించనున్నారు. సోమవారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలోని 787 హుండీలను పోలీస్ భద్రత నడుమ ప్రత్యేక వాహనాల్లో హనుమకొండకు తరలించినట్లు ఆలయ ఈఓ వీరస్వామి తెలిపారు. భక్తుల కానుకల కోసం గద్దెల ప్రాంగణంలో మరో 40 హుండీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఏటూరునాగారం: మేడారం జాతరలో విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు ఊరట్టం ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించామని, జాతర ముగి యడంతో మిగిలిన సరుకులను మేడారం ఇంగ్లిష్ మీడియం గోదాంకు తరలించామని హెడ్మాస్టర్ కల్తి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘జాతరకు కేటాయించిన బియ్యం పక్కదారి’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి వివరణ ఇచ్చారు. బియ్యం ఎలాంటి దుర్వినియోగం జరగలేదన్నారు. గిరిజన సంక్షేమశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఊరట్టం గోదాం ఇన్చార్జ్ రాజయ్య క్యాంప్ నుంచి ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు తరలించామని, సామగ్రి పక్కదారి పట్టలేదన్నారు.
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతరకు వచ్చి ఓ మహిళ తప్పిపోయింది. ఈ ఘటన సోషల్ మీడియా ద్వారా సోమవారం వెలుగులోకి వచ్చింది. మేడారం మహాజాతరకు కుటుంబీకులతో వచ్చి తప్పిపోయిన ఓ మహిళ తాడ్వాయి మండల కేంద్రంలోని నర్సింగాపూర్ గ్రామంలో సంచరిస్తుంది. గ్రామస్తులు సదరు మహిళ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా తాను కుటుంబ సభ్యులతో వచ్చి తప్పిపోయానని.. కుటుంబీలకు తెలిసేలా వాట్సాప్లోని అన్ని గ్రూపుల్లో షేర్ చేయాలని వేడుకుంటుంది. తన అక్క పేరు రజిత అని మాత్రమే చెబుతోంది. మిగతా వివరాలు తెలపడం లేదు. తెలిసిన వారు ఉంటే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రేపు తిరుగువారం పండుగ
రేపు తిరుగువారం పండుగ


