వర్షంలో తడుస్తూ భోజనం కోసం క్యూలో నిల్చున్న క్రీడాకారిణులు
సాక్షిప్రతినిధి, వరంగల్: వర్షంలో తడుస్తూ అన్నం కోసం క్యూలో నిల్చున్న వీరంతా వినాయక మండపం వద్ద భక్తులు కాదు.. అనేక సంవత్సరాల కఠోర సాధన ఫలితంగా వచ్చే ప్రతిభను చాటేందుకు వచ్చిన యువ క్రీడాకారిణులు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్ర స్టేడియంలో కనిపించిన ఈ చిత్రం క్రీడాభిమానులను కలిచివేసింది. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ఎంతో దూరం నుంచి వచ్చిన క్రీడాకారిణులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కనీస వసతుల కల్పనలో అలసత్వం వహించడంపై సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు నిర్వాహకుల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు.
జేఎన్ఎస్లో పోటీలు
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గురువారం తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అచీవింగ్ స్పోర్ట్స్ మైల్స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రు యాక్షన్ (అస్మిత) ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. అన్ని కేటగిరీల్లో బాలికలు, మహిళలలో ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని మరింత ప్రోత్సహించాలన్నదే అస్మిత ప్రధాన లక్ష్యం. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారిణులకు ఒక్కరోజు పోటీలు నిర్వహించాలని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ)కు కేంద్రం సూచించింది. కాగా, ఏఎఫ్ఐ నిర్వహణ బాధ్యతలను అథ్లెటిక్స్ అసోసియేషన్కు అప్పగించింది.
పోటీలను మమ అనిపిస్తే చాలు..
ప్రతిభ, ప్రోత్సాహం పక్కన పెడితే కేవలం పోటీలు నిర్వహిస్తే చాలు అన్నట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ వ్యవహరించిందని టెక్నికల్ అఫీషి యల్స్, సీనియర్ క్రీడాకాణులు, కోచ్లు వాపోయారు. గురువారం ఉదయం 5.30 గంటల నుంచి నగరంలో దాదాపు గంట పాటు భారీ వర్షం కు రిసింది. దీంతో జేఎన్ఎస్లోని సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ తడిసిపోవడంతో పాటు అక్కడక్కడ నీరు నిలిచింది. దీంతో స్కిడ్ అవుతుందని క్రీడాకారులు షూ లేకుండానే పోటీల్లో పాల్గొన్నారు.
తడిసిన ట్రాక్పై రన్నింగ్..
తడిసిన సింథటిక్ ట్రాక్పై అథ్లెట్లు రన్నింగ్ చేయడానికి ఇబ్బందులు పడ్డారు. వివిధ కేటగిరీల్లో పాల్గొన క్రీడాకారిణులకు 100, 200, 400, 800, 1500 మీటర్ల రన్నింగ్తో పాటు డిస్కస్ త్రో, షాట్పుట్, జావెలిన్త్రో, లాంగ్జంప్, త్రిబుల్జంప్, హైజంప్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 600 క్రీడాకారిణులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.
చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. ఖేలో ఇండియా పోటీలు నిర్వహించడం అభినందనీయమని, వచ్చే నెలలో జరిగే సౌత్జోన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు హనుమకొండ ఆతిథ్యం ఇస్తుందన్నారు. అనంతరం విజేతలకు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో ‘కుడా’ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్, హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్, అథ్లెటిక్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, సంఘం బాధ్యులు ఐలి చంద్రమోహన్గౌడ్, ఎండీ గౌస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
తడిసిన సింథటిక్ ట్రాక్పైనే అథ్లెటిక్స్ పోటీలు
ఇబ్బందులు పడిన క్రీడాకారిణులు
వర్షంలోనే భోజనం.. తడుస్తూ క్యూలైన్లో అన్నం కోసం బారులు
నిర్వాహకుల పనితీరుపై అసహనం
కనీస వసతుల కల్పనలో అలసత్వం
షూ లేకుండా తడిసిన ట్రాక్పై రన్నింగ్ చేస్తున్న క్రీడాకారిణులు


