గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం నందున్న చలపతి ఫార్మసీ కళాశాల విద్యార్థి పీజీ సెట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించి విశేష ప్రతిభ కనబరచి సంస్థకు గర్వకారణంగా నిలిచాడని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ సెట్ పరీక్ష ఏప్రిల్ 28వ తేదీన జరిగిందని తెలిపారు. పీజీ సెట్లో తమ విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించడం సంస్థలో అందిస్తున్న నాణ్యమైన బోధన విధానం, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణం, అధ్యాపకుల అంకితభావం విద్యార్థుల కృషికి నిదర్శనమన్నారు. పరీక్షలో తమ కళాశాల విద్యార్థి బల్లా వెంకటజస్వంత్ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించి సంస్థకు విశిష్ట గౌరవాన్ని తీసుకువచ్చాడన్నారు. ఈ పరీక్షకు మొత్తం 42 మంది విద్యార్థులు హాజరుకాగా 42 మంది ఉత్తీర్ణులై ర్యాంకులు సాధించారన్నారు. ఇలాగే మరెన్నో విజయాలు సాధిస్తూ సంస్థ ప్రతిష్టను మరింతగా పెంచాలని సంస్థ చైర్మన్ వై.వి. ఆంజనేయులు ఆకాంక్షించారన్నారు.


