పలు జిల్లాల నుంచి 300 మంది రాక
నేడు కూడా కొనసాగనున్న పోటీలు
ఏఎన్యూ(పెదకాకాని): ఆంద్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శాప్ లీగ్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్(మాస్టర్స్) పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి ఆఫ్రోజ్ ఖాన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి 300 మంది మాస్టర్స్ అథ్లెటిక్స్ హాజరయ్యారు. 35 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలు, పురుషులకు 100 మీటర్లు, 400, 800 మీటర్లు, 1500 మీటర్లు పరుగుపందెం, లాంగ్జంప్, డిస్కస్త్రో, షాట్పుట్, జావలిన్త్రో, రిలే పరుగపందెం నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్.సుబ్బారావు, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ పాల్కుమార్, స్పోర్ట్స్ స్పెషలిస్ట్ డాక్టర్ యం.శివకుమార్, ఇంటర్నేషనల్ అథ్లెట్ కె. కృష్ణమోహన్, జిల్లా మాస్టర్ అసోసియేషన్ సెక్రటరీ సీహెచ్.కొండయ్య, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ జీవీఎస్.ప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్.సుబ్బారావు మాట్లాడుతూ వెటరన్ క్రీడా మహోత్సవం అనేది వయస్సు పైబడిన క్రీడాకారుల ఉత్సాహం, ఆరోగ్యం, క్రీడాస్ఫూర్తిని గౌరవించేందుకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అన్నారు. 40 సంవత్సరాలు పైబడిన అనేక మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొని, వయస్సుతో పనిలేకుండా ప్రతిభ కనబర్చారని అన్నారు. ఇది ఆరోగ్యం, పట్టుదల, జీవితాంతం క్రీడల పట్ల ఆసక్తిని ప్రోత్సహించే గొప్ప వేదిక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోచ్ లు, సిబ్బంది పాల్గొన్నారు.


