గుంటూరు రూరల్: మండలంలోని వెంగళాయపాలెం గ్రామంలో నిర్మించిన టిడ్కో నివాసాల్లో సోమవారం స్థానిక ఎమ్మెల్యే గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పేదలకు గృహాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లక్షలాది మందికి ఇళ్ల పట్టాలను అందజేశారు. అదే జగనన్న పట్టాలతో సోమవారం స్థానిక ఎమ్మెల్యే గృహ ప్రవేశాలను జరిపించి మమ అనిపించారు. అధికారులు సైతం పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయకపోవటంతో లబ్ధిదారులు గతంలో తమకు జగనన్న ఇచ్చిన పట్టాలను తీసుకుని కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యే అధికారులపై చిర్రుబుర్రులాడారు. కొందరికి కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలతో, మరికొందరికి జగనన్న ఇచ్చిన పట్టాలతో గృహ ప్రవేశాలు జరిపించారు.
పాత వారి స్థానంలో కొత్త వారి ఎంపిక
గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలను అందించిన లబ్ధి దారులను విస్మరించి చంద్రబాబు ప్రభుత్వం నూతనంగా అదే స్థానంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన కార్యక్రమాన్ని కూడా సక్రమంగా నిర్వర్తించకుండా లబ్ధిదారులకు పట్టాలను సక్రమంగా పంపిణీ చేయలేకపోయారు. ఇదే క్రమంలో జగనన్న ప్రభుత్వంలో పట్టాలు పొందినవారికి ఇళ్లు లేవని బాహాటంగానే కూటమి నేతలు సమావేశంలో చెప్పటంతో ప్రజలు, లబ్ధిదారులు విచారం వ్యక్తం చేశారు.
పట్టాలు ఒకరికి..ఇళ్లు మరొకరికి..
గత ప్రభుత్వంలో టిడ్కో సముదాయంలో పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరగలేదు. దీంతో పట్టాలు పొందినప్పటికీ అనేక మంది గృహప్రవేశాలు చేయలేకపోయారు. ఈ క్రమంలో గతంలో లబ్ధిదారులుగా ఎంపికై న వారికి పంపిణీ చేసిన నివాసాలను సైతం టీడీపీ నేతలు వారికి అనుకూలంగా ఉన్నవారికి కేటాయించి గృహ ప్రవేశాలు చేస్తున్నారని లబ్ధిదారులు, ప్రజలు చర్చించుకున్నారు.


