తాడికొండ: ఏపీ సీఆర్డీఏ కమిషనర్గా వి.విజయరామరాజు శనివారం బాధ్యతలు చేపట్టారు. సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ఐదవ ఫ్లోర్లోని కమిషనర్ చాంబర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆయన, సీఆర్డీఏ అదనపు కమిషనర్ ఎ.భార్గవతేజ, ఆఫీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, ఇతర ముఖ్య అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. విజయ రామరాజుకు సీఆర్డీఏలోని అన్ని విభాగాల ముఖ్య అధికారులు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ అనంతరం సీఆర్డీఏలోని వివిధ విభాగాల ప్రధాన అధికారులతో కమిషనర్ సమావేశమయ్యారు.
గుంటూరు వెస్ట్: గ్రూప్–2 ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికై న పదిమంది అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా శనివారం నియామక పత్రాలు అందజేశారు. హరికృష్ణ, ఎం.మహేశ్వరరావు, ఎన్.హర్షవర్ధన్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, జి.ఉమాకాంత్, పి.రెడ్డి రాజా, టి.సుధాకర్, పి.వినయ్కుమార్, వై.అనిల్కుమార్, ఎస్.లక్ష్మీనారాయణ నియామక పత్రాలు అందుకున్న వారిలో ఉన్నారు. వీరంతా 12 రోజులపాటు శాఖాపరమైన శిక్షణకు హాజరు కావలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి పాల్గొన్నారు.
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : బాపట్ల జిల్లా చీరాలలో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు శనివారం హోటళ్లు, దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చీరాల పట్టణం కొత్తపేట బైపాస్లోని సాయి నందన కేఫ్లో తనిఖీలు చేయగా, మూడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు గుర్తించారు. అదే ప్రాంతంలోని డైమండ్ బేకరీలో తనిఖీ చేయగా, మరో రెండు గృహ వినియోగ సిలిండర్లు గుర్తించారు. ఐదు సిలిండర్లు స్థానిక సీఎస్డీటీ అధికారులకు అప్పగించారు. ఆయా దుకాణాల యజమానులపై 6ఏ కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్, స్థానిక పౌరసరఫరాల శాఖ అధికారులు ఉన్నారు.
నరసరావుపేట: జిల్లాలో ‘మనబడి–మన భవిష్యత్‘ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాఠశాలల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తక్కువ మరమ్మతులు అవసరం ఉండి, త్వరగా అందుబాటులోకి వచ్చే తరగతి గదులు, మరుగుదొడ్లుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ‘100 రోజులు–100 తరగతి గదులు’ గా నామకరణం చేస్తూ జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయిన పాఠశాలలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట, అత్యవసరంగా మరమ్మతులు అవసరమైన జిల్లా పరిషత్ హైస్కూళ్ల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.


