గుంటూరు మెడికల్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కిడ్ని మార్పిడి ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమైన ఓ రోగికి ఆపరేషన్ అనుమతి మంజూరుకు కార్యాలయ ఉద్యోగి రూ. లక్ష లంచం డిమాండ్ చేసినట్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు అందాయి. జిల్లా కలెక్టర్కు బాధితుడు లిఖిత పూర్వకంగా చేయడంతో రెండు రోజుల క్రితం ఆసుపత్రి అధికారులు రహస్యంగా విచారణ చేశారు తప్ప, సదరు జూనియర్ అసిస్టెంట్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండి పోయారు. వివరాల్లోకి వెళితే...
● పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామానికి చెందిన కె.సూర్యనారాయణ కిడ్ని మార్పిడి ఆపరేషన్ అనుమతి కోసం డీఎంఈ కార్యాలయం ద్వారా జీజీహెచ్ అధికారులకు దరఖాస్తు చేశాడు.
● జీజీహెచ్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఉదయ భాస్కర్ డాక్యుమెంట్స్ పరిశీలించి కిడ్ని మార్పిడి ఆపరేషన్కు అనుమతులు వారం రోజుల్లో మంజూరు చేయాల్సి ఉంది. కాని నాలుగు నెలలకు పైగా కాలయాపన చేసి సూర్యనారాయణను ప్రాణాపాయ స్థితికి చేరుకునేలా చేయడంతోపాటు, కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు, ఆర్థిక ఇబ్బందులకు గురిచేశాడని ఉదయభాస్కర్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి సోదరుడు లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్కు లిఖిత పూర్వకంగా గతనెలలో ఫిర్యాదు చేశాడు.
● తమలాగా మరెవరూ జీజీహెచ్లో ఇబ్బంది పడకూడదని, తక్షణమే విచారణ చేసి జూనియర్ అసిస్టెంట్ను ఉద్యోగం నుంచి తొలగించి ఎంతో మంది జీవించే హక్కు కాలరాస్తున్న అతనిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో కోరారు.
● ఉదయభాస్కర్కు డబ్బులు చెల్లించినట్లుగా ఫోన్పే ఆధారాలు, ఆడియో, వీడియో సీడీలు సైతం ఆసుపత్రి అధికారులకు, కలెక్టర్కు బాధితులు అందజేశారు. అయితే ఆసుపత్రి అధికారులు రెండు రోజుల క్రితం రహస్యంగా విచారణ చేసి సదరు జూనియర్ అసిస్టెంట్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారు.
గతంలోనూ ఫిర్యాదులు
● గతంలో ఉదయభాస్కర్పై ఇదే తరహాలో ఫిర్యాదులు వచ్చాయి. ఓ పోలీసు అధికారి సైతం కిడ్ని మార్పిడి ఆపరేషన్ అనుమతులు జాప్యం చేయడం వల్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గతంలో ఆసుపత్రి అధికారులు సీటు మార్పు చేస్తున్నట్లు ప్రకటించారు. పలువురు బాధితులు సైతం లిఖిత పూర్వకంగా ఆధారాలతో జూనియర్ అసిస్టెంట్పై ఫిర్యాదు చేసినా ఆసుపత్రి అధికారులు అతడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోవడం విమర్శలకు తావిస్తుంది.
● కిడ్ని రోగులకు ఎంత త్వరగా కిడ్ని మార్పిడి ఆపరేషన్ చేస్తే అంత త్వరగా వారు నూతన జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంది. అలాంటి కీలకమైన సీటులో జూనియర్ అసిస్టెంట్ మామూళ్ల కోసం కిడ్ని రోగులను నెలల తరబడి అనుమతులు ఇవ్వకుండా వేధిస్తున సంఘటనలు, రూ.లక్షల్లో లంచాలు డిమాండ్ చేస్తున్న సంఘటనలు జరుగుతు న్నా ఆసుపత్రి పరువు మంట కలుస్తున్నా ఆసుపత్రి అధికారులు సదరు జూనియర్ అసిస్టెంట్ను ఎందుకు కాపాడుతున్నారో వారికే తెలియాలి.
జీజీహెచ్ కార్యాలయ
ఉద్యోగిపై బాధితుడి ఫిర్యాదు
రహస్య విచారణ చేసిన
ఆసుపత్రి అధికారులు
క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా
చోద్యం చూస్తున్న అధికారులు


