స్పందించిన పోలీసులు
● ఎనిమిది మందికి గాయాలు
● ఇద్దరి పరిస్థితి విషమం
● దర్గా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం
మంగళగిరి టౌన్: మంగళగిరి జాతీయ రహదారిపై చినకాకాని వద్ద శుక్రవారం అర్ధరాత్రి కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మేడికొండూరుకు చెందిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు వాహనంలో చిన్నారి మొక్కు తీర్చుకునేందుకు అమలాపురం దర్గాకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో మంగళగిరి జాతీయ రహదారిపై ఎదురుగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. పల్టీలు కొట్టుకుంటూ జాతీయ రహదారిపై నుంచి సర్వీస్రోడ్లోకి దూసుకుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో సమీపంలో ఉన్న ఎన్ఆర్ఐ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనలో మొక్కు తీర్చుకున్న బాలుడికి ఎటువంటి ప్రమాదం జరగకుండా బయటపడడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారు సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. జరిగిన ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంగళగిరి రూరల్ పోలీసులు సకాలంలో స్పందించడంతో గాయపడిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే మంగళగిరి రూరల్ సీఐ బ్రహ్మం, ఎస్ఐ వెంకట్లు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన క్షతగాత్రులను స్వయంగా వారే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రావడం ఏ మాత్రం ఆలస్యమైనా పలువురి పరిస్థితి విషమంగా మారే అవకాశం ఉండేదని క్షతగ్రాతులు తెలియజేశారు. తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న షేక్ బాజీ వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నట్లు సమాచారం.


