రేపటి నుంచి నేపాల్ ప్రతినిధి బృందం పర్యటన కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతు సాధికార సంస్థ అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం(ఏపీసీఎన్ఎఫ్) విధానాలను అధ్యయనం చేయడానికి నేపాల్ దేశానికి చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజులపాటు గుంటూరు, ఏలూరు జిల్లాల్లో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా మొదటి రోజు గుంటూరులోని రైతు సాధికార సంస్థ(ఆర్వైఎస్ఎస్) కార్యాలయంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ కుమార్తో బృందం సమావేశమవుతుంది. ప్రకృతి వ్యవసాయంలో కమ్యూనిటైజేషన్, ట్రాన్స్ఫర్మేషన్, మార్కెటింగ్, హెల్త్, న్యూట్రిషన్ వంటి అంశాలపై ఆయా విభాగాల నిపుణులు బృందానికి అవగాహన కల్పిస్తారు. మధ్యాహ్నం అత్తోట గ్రామంలో 9 సూత్రాల అమలు, కమ్యూనిటీ రిసోర్స్ వర్కర్స్ సభ్యులతో భేటీ, బాపయ్య గారి విత్తన ఉత్పత్తి క్షేత్రాన్ని బృందం సందర్శించనుంది. రెండో రోజు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని గుండుగొలనుగుంట గ్రామంలో బృందం పర్యటిస్తుంది. అక్కడ బయో–ఇన్పుట్ రిసోర్స్ సెంటర్(బీఆర్సీ) సందర్శించి బీజామృతం, ద్రవ జీవామృతం, అగ్ని అస్త్రం వంటి కషాయాల తయారీని పరిశీలిస్తారు. అలాగే ఆయిల్ పామ్, కొబ్బరి తోటల్లో అంతర పంటలుగా మిశ్రమ వ్యవసాయం చేస్తున్న క్షేత్రాలు, ఏటీఎం(ఎనీటైం మనీ) మోడల్ సాగును బృందం సందర్శిస్తుంది. మహిళా సంఘాలు, రైతులు, శాస్త్రవేత్తలతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించనున్నారు. చివరి రోజు గుంటూరు జిల్లా ఎరుకలపూడిలో జొన్న పంట క్లస్టర్లను, రైతు సేవా కేంద్రాలను సందర్శిస్తారు. రోశయ్య గారి ఐదు అంచెల ప్రకృతి వ్యవసాయ నమూనాలను పరిశీలించిన అనంతరం, ఆర్వైఎస్ఎస్ ఎగ్జిక్యూటివ్ వైఎస్ చైర్మన్ విజయ కుమార్తో సమీక్షా సమావేశంలో పర్యటన అనుభవాలను పంచుకుంటారు. ఏపీలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ నమూనాలను, క్షేత్రస్థాయిలో రైతుల జీవన ప్రమాణాల్లో వస్తున్న మార్పులను నేపాల్లో కూడా అమలు చేసే అవకాశాలను పరిశీలించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్ధేశ్యమని రైతు సాధికార సంస్థ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
డ్రైవర్ నిర్లక్ష్యంతో చిన్నారి దుర్మరణం
నిజాంపట్నం: ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ చిన్నారి దుర్మరణం పాలైన ఘటన మండలంలోని పాత హారిసుపేటలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన గుడిపల్లి హనుమాంజి, పడమటి స్పందనాదేవి భార్యాభర్తలు. వీరికి కుమారుడు బెన్నివిజయ్. స్పందనాదేవి రేపల్లెలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. గ్రామం నుంచి రేపల్లె ప్రతి రోజు వెళ్తోంది. అదే గ్రామానికి వచ్చే రేపల్లె పట్టణానికి చెందిన రామకృష్ణ ఇంగ్లిష్ మీడియం హైస్కూలు బస్సును ఆమె ఆశ్రయించింది. స్పందనాదేవి స్కూల్ బస్సు ఎక్కటం చిన్నారి బెన్నీవిజయ్ గమనించాడు. కొద్ది దూరం వెళ్లిన బస్సు డ్రైవర్ వేరొకరితో మాట్లాడేందుకు బస్సును నిలిపటంతో, గమనించిన చిన్నారి బెన్నీ విజయ్ పరిగెత్తుకుంటూ తన తల్లి స్పందానాదేవి వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించని డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు పోనివ్వటంతో బస్సుకు ఎడమవైపున సైడ్ ఎడ్జి తగిలి చిన్నారి బెన్నీవిజయ్ బస్సు చక్రం కింద పడి మృతి చెందాడు. తండ్రి హనుమాంజి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేన్నారు. రేపల్లె ఆర్డీఓగా శ్రీదేవి బాధ్యతలు స్వీకారం రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
రేపల్లె,బాపట్ల: రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీఓ)గా బూసి శ్రీదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా కేఆర్సీలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా బాధ్యతలు తీసుకున్న ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందించటం జరుగుతుందని చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని డివిజనల్ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారిగా బి.శ్రీదేవి బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ని మర్యాద పూర్వకంగా కలిశారు.
బుట్టాయగూడెం: ద్విచక్ర వాహనాలు ఢీకొని ఐదుగురు గాయపడిన ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలోని శివాలయం సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం గణపవరానికి చెందిన తాళ్లభోగి సురేష్, కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, మనవడితో పొగాకు పనుల నిమిత్తం వచ్చి కంసాలిపాలెంలో నివాసముంటున్నారు. మనవడు చిన్నా పానీపూరీ అడగడంతో సురేష్ కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, చిన్నాతో కలిసి ద్విచక్రవాహనంపై బుట్టాయగూడెం వస్తున్నారు. అదే సమయంలో స్థానిక అరుంధతీ కాలనీకి చెందిన ఉండ్రాజవరపు కాంతారావు, మరో యువకుడు ద్విచక్ర వాహనంపై బుట్టాయగూడెం నుంచి శివాలయం వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను అంబులెన్స్లో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రియాంక, చిన్నా, శ్రావణిలకు స్వల్ప గాయాలు కావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే వైద్య సేవలు అందించారు. కాంతారావు, సురేష్ల పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో జంగారెడ్డిగూడెం తరలించారు.