మేడికొండూరు: మండల పరిధిలోని పేరేచర్ల కై లాసగిరి సమీపంలో ఉన్న క్వారీ గుంతలో ఈతకు దిగి విద్యార్థి గల్లంతైన సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. మేడికొండూరు సీఐ మధుసూదన్ రావు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు రూరల్ మండలం పెద్ద పలకలూరు గ్రామానికి చెందిన బండారు రాంబాబు కుమారుడు చంద్రశేఖర్, అతని స్నేహితుడు నేలకంఠ గీతా భగవాన్లు ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు. చంద్రశేఖర్ తన ద్విచక్ర వాహనంపై గీతా భగవాన్తో కలసి పెద్ద పలకలూరు నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటల సమయంలో కై లాసగిరి పర్వతాల వెనుక వైపున ఉన్న పాత క్వారీ గుంత వద్దకు చేరుకున్నాడు. చంద్రశేఖర్ నీటిలోకి దిగి ఈత కొడుతూ మధ్య వరకు వెళ్లి అకస్మాత్తుగా మునిగాడు. గమనించిన అతని స్నేహితుడు గీతా భగవాన్ సమీపంలోని వారికి సమాచారం ఇచ్చి, వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. మేడికొండూరు పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి చంద్రశేఖర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 9.30 గంటల వరకు వెతికినా చంద్రశేఖర్ ఆచూకీ తెలియరాలేదు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.


