తెనాలిటౌన్: వైకుంఠపురం లోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ కానుకలు సోమవారం లెక్కించారు. రూ.51 లక్షల నగదు, 61 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 745 గ్రాముల వెండి వచ్చింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ మాట్లాడుతూ 93 రోజులకు హుండీ కానుకలు లెక్కించగా ఈ ఆదాయం వచ్చినట్లు చెప్పారు. 75 మంది వలంటీర్లు, బ్యాంకు సిబ్బంది దేవస్థాన సిబ్బందితో లెక్కింపు చేపట్టినట్లు వివరించారు. పర్యవేక్షణాధికారిగా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సైదామాబి వ్యవహరించినట్లు తెలిపారు.
శావల్యాపురం: పల్నాడు జిల్లా శావల్యాపురంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్యూబీ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు గుంటూరు రైల్వే డివిజనల్ ఇంజనీరు (డీఈ) డి.శరత్ తెలిపారు. రైల్వే స్టేషను పరిధిలో జరుగుతున్న పనులను సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఉన్నతాధికారుల అదేశాలకనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పది రోజుల వ్యవధిలోని పనులు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. పనుల్లో భాగంగా రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఆయనతో పాటు రైల్వే అధికారులు, మతుకుమల్లి గ్రామ మాజీ సర్పంచ్ ముండ్రు హనుమంతరావు ఉన్నారు.
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో ఫెమ్ప్లేర్ 2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం కార్నివాల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెమ్ప్లేర్–2026 చైర్ పర్సన్ డాక్టర్ కె. రూతురమ్య మాట్లాడుతూ అతిపెద్ద మహిళా వేడుక అని పేర్కొన్నారు. బాలికలే స్వయంగా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ మహిళా సమ్మేళనాన్ని నిర్వహిస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆయా కళాశాలల నుంచి విద్యార్థినులు హాజరు కానున్నారని తెలిపారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడంలేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 34.6755 టీఎంసీలు.


