ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున పన్ను వసూలుపై యంత్రాంగం దృష్టి పెద్ద మొత్తంలో బకాయిలున్న వారికి రెడ్ నోటీసులు జారీపై దృష్టే లేదు కుళాయి, డ్రైయినేజీ ఇతర అత్యవసర సేవలను నిలిపేసేలా చర్యలు శూన్యం దీర్ఘకాలంగా బకాయిలున్న వాణిజ్య సంస్థలనూ సీజ్ చేయలేని దైన్యం పెద్ద మొత్తం చెల్లించాల్సిన పన్ను బకాయిదారులు 300 మందికిపైనే నీటి మీటర్ చార్జీల వసూలులోనూ అధికారులది అదే ఉదాసీనత ప్రత్యేక అధికారి పాలనలోనైనా అన్ని వ్యవహారాలు చక్కబడేనా?
వాణిజ్య సంస్థలపై చర్యలు శూన్యం
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో లక్ష్యాల సాధన అంతంతే
గుంటూరు నగరపాలక సంస్థకు బకాయిలు ఉన్న పన్నులు వసూలు చేయడంలో సంబంధిత రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ వసూళ్లపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం ప్రైవేట్ వారి నుంచి పన్ను వసూళ్ల విషయంలో కాస్త ఫర్వాలేదన్నట్లుగా ఉంది. ఖాళీ స్థలాలు, వాటర్, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీలకు సంబంధించిన బకాయిలు వసూలు చేయడంలో అధికారులు వెనుకంజలో ఉన్నారు. నగరాభివృద్ధికి కీలకమైన ఆదాయం సమకూర్చడానికి ప్రత్యేక అధికారి అయిన జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ బిల్డింగ్లకు సంబంధించిన మొత్తం అసెస్మెంట్లు 2,17,929 ఉన్నాయి. వీటికి సంబంధించి డిమాండ్ రూ.350 కోట్లు ఉంది. ఈ నెల 21వ తేదీ నాటికి ఇందులో వసూలు అయింది రూ.127.86 కోట్లు మాత్రమే. ఇంకా రూ.222.93 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ప్రైవేట్ పాపర్టీకి సంబంధించి చూస్తే 2,07,415 ప్రాపర్టీలకు ఇంటి పన్నులు వసూలు చేయాలి. వీటికి రూ.186.43 కోట్ల డిమాండ్ ఉండగా... ఇందులో వసూలు అయింది రూ.110.12 కోట్లు మాత్రమే, ఇంకా రూ.76.31 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అసెస్మెంట్లు 309 ఉన్నాయి. వీటికి మొత్తం డిమాండ్ రూ.30.36 కోట్లు కాగా, వసూలు అయింది రూ.2.49 కోట్లు మాత్రమే. ఇంకా రూ.27.86 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి 142 అసెస్మెంట్లు ఉన్నాయి. వీటికి మొత్తం డిమాండ్ రూ.12.78 కోట్లు. వీటిల్లో వసూలు అయినవి రూ.35.41 లక్షలు మాత్రమే. ఇంకా రూ.12.43కోట్లు వసూలు కావాల్సి ఉంది.
ఖాళీ స్థలాలూ ఎక్కువే..
నగరంలో 9,997 ఖాళీ స్థలాలకు అసెస్మెంట్లు ఉన్నాయి. వీటిలో మొత్తం డిమాండ్ రూ.115.60 కోట్లు. కానీ 21వ తేదీ వరకు వసూలు అయింది రూ.13.78 కోట్లు మాత్రమే. ఇంకా రూ.101.82 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. నగరంలో గృహా అవసరాలకు వాడే నీటి పన్నులు 1,12,850 అసెస్మెంట్లు ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం డిమాండ్ రూ.28.37 కోట్లు. ఇప్పటి వరకు వసూలు చేసింది రూ.7.12 కోట్లు మాత్రమే. ఇంకా రూ.21.25కోట్లు వసూలు కావాల్సి ఉంది. అదే విధంగా కమర్షియల్, అపార్ట్మెంట్స్కు వాడే వాటర్ చార్జీలు (మీటర్) మొత్తం 4478 అసెస్మెంట్లు ఉన్నాయి. వీటికి డిమాండ్ రూ.53.80 కోట్లు కాగా.. ఈ నెల 21వ తేదీ వరకు వసూలు అయింది రూ.6.10 కోట్లు మాత్రమే. ఇంకా రూ.47.70 కోట్లు వసూలు కావాల్సి ఉంది. బకాయిలు ఉన్నవారి ట్యాప్ కనెక్షన్లు కట్ చేయాల్సిన అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారనే చెప్పుకోవచ్చు.
గుంటూరు నగరపాలక సంస్థలో దీర్ఘకాలికంగా రూ.కోట్లల్లో బకాయిలు ఉన్నవారు పదుల సంఖ్యలో ఉన్నారు. రూ.10 లక్షలకు పైగా బకాయిలు ఉన్నవారు వందల సంఖ్యల్లోనే ఉన్నారు. వీరి వద్ద నుంచి బకాయిలు వసూలు చేయడంలో అధికారులు విఫలం చెందారనే చెప్పుకోవచ్చు. రెడ్ నోటీసులు ఇచ్చి వారి ట్యాప్ కనెక్షన్, డ్రైయినేజీ కనెక్షన్ కట్ చేస్తామని చెప్పినప్పటికి బకాయిదారుల్లో కనీసం చలనం లేదనే చెప్పుకోవచ్చు. ప్రత్యేక అధికారి పాలనలో అయిన మొండి బకాయిదారులపై దృష్టి సారించాల్సి ఉంది. వారి నుంచి రూ.కోట్ల రూపాయిల బకాయిలు వస్తే ప్రజలకు మేలు చేకూర్చే అభివృద్ధి పనులకు ఉపయోగపడతాయి. అదే విధంగా కేంద్ర, ప్రభుత్వ కార్యాలయ నుంచి బకాయిలు వసూలు చేయగలిగితే కార్పొరేషన్ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.


