ఇళ్లకు సమీపంలో 11కేవీ లైన్ నిర్లక్ష్యంగా విద్యుత్ అధికారులు
తాడేపల్లి రూరల్: ఆడుకుంటున్న సమయంలో చేతిలో ఉన్న బెల్టు ఇంటికి అతి సమీపంలో వున్న 11 కేవీ విద్యుత్ వైర్లపై పడింది. దానిని తీసేందుకు ప్రయత్నించిన ఇద్దరికి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి సెంటర్లో జామాయిల్ తోటలో నివాసముండే పుప్పాల శ్రీనివాస్, దుర్గ దంపతులకు కుమార్తె, కుమారుడు. ఇతను ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శ్రీనివాస్ తమ్ముడు సురేష్ అలియాస్ బుజ్జి చిరు ఉద్యోగం చేస్తూ ఉండవల్లి సెంటర్లోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద మూడో అంతస్తులో అద్దెకు నివాసముంటున్నాడు. సురేష్కు కూడా ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ పిల్లలు ఆడుకునేందుకు సురేష్ ఇంటికి వచ్చారు. నలుగురు పిల్లలు కారిడార్లో ఆడుకుంటున్న సమయంలో సురేష్ కొడుకు త్రివిక్రమ్ చేతిలోని బెల్టును విసిరివేశాడు. అది 11 కేవీ వైర్లపై పడింది. పక్కనే ఉన్న శ్రీనివాస్ కుమార్తె విష్ణుప్రియ బెల్టును తీసేందుకు ఇంటికి మాపు వేసే ఐరన్ పైపు కలిగి ఉన్న కర్రతో ప్రయత్నించింది. దీంతో విష్ణుప్రియకు, త్రివిక్రమ్కు విద్యుత్ షాక్ తగిలింది. పెద్దగా కేకలు వినిపించడంతో ఇంట్లో నిద్రిస్తున్న సురేష్, స్రవంతిలు బయటకు వచ్చి చూడగా పిల్లలు ఇద్దరూ మంటల్లో కాలిపోతున్నారు. ఏం జరిగిందో అర్ధంకాక పెద్దగా కేకలు వేసి ఇంట్లో ఉన్న దుస్తులతో మంటలను అదుపుచేశారు. ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ అయి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిద్దరిని తల్లిదండ్రులు, ఇతర స్నేహితులు వైద్య నిమిత్తం విజయవాడ ఆసుపత్రిలో చేర్పించారు. 11 కేవీ విద్యుత్ వైర్లు ఇంటి ముందు నుంచి వెళుతున్నా ఇంటి యజమాని విద్యుత్ సరఫరా కాకుండా పైపులైన్లు వేయించలేదు. ప్రమాదం అని తెలిసినా విద్యుత్ శాఖ అధికారులు ఆ బిల్డింగ్ యజమానికి సూచించలేదు. వారి నిర్లక్ష్యం కారణంగా చిన్నారులిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 8వ తరగతి చదువుతున్న విష్ణుప్రియకు జుట్టుతోపాటు రెండు చేతులు, ఛాతీ పూర్తిగా కాలిపోయింది. కుడిచేయి బొటన వ్రేలు, చూపుడు వేలు తీసివేయాలని వైద్యులు తెలియజేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. త్రివిక్రమ్కు రెండు చేతులు, కుడిచేయి ఛాతీ కింద భాగంలో పూర్తిగా విద్యుత్ ఘాతానికి గురై కాలిపోయాయి.


