తాడేపల్లి రూరల్: యుద్ధ ప్రభావం గ్యాస్ సిలిండర్ల సరఫరాపై పడుతోంది. ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ బండలు దొరకడం లేదు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా హోటళ్లు వెయ్యికిపైగా ఉన్నాయి. పెద్ద హోటళ్లు సుమారు 200 వరకు ఉన్నాయి. ప్రతి రోజు ఆరు వందల వరకు కమర్షియల్ గ్యాస్ బండలను వినియోగిస్తారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అధికారుల సూచనల మేరకు గృహావసరాలకు గ్యాస్ కూడా బుక్ చేసిన 25 నుంచి 30 రోజులలోపు వస్తోంది. కొంతమంది గ్యాస్ బుక్ చేస్తుంటే నో సర్వర్ అని ఫోన్లో చూపిస్తోంది. ఇప్పటికే గ్యాస్ కొరత వల్ల కొన్నిచోట్ల హోటళ్లు మూతబడ్డాయి. కొంతమంది కమర్షియల్ గ్యాస్ బండ ధర రూ. 1700 ఉండగా, రూ. 3,400కు కొనుగోలు చేస్తున్నారు. మరికొంతమంది రూ.6 వేల నుంచి రూ. 7 వేలకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. యజమానులు ఇప్పటికే ప్రతి టిఫిన్పై రూ.5 నుంచి రూ. 10 వరకు పెంచారు. టీ దుకాణాల్లో గతంలో ఆఫ్ టీ రూ.7 ఉండగా ఇప్పుడు రూ.10–12 చేశారు. కాఫీ ధర రూ.25కు పెంచారు. మరో 20 రోజులు గ్యాస్ సరఫరా చేయకపోతే లాక్డౌన్ తరహా పరిస్థితి చూడాల్సిన వస్తుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు సమయం పడుతుందని చెబుతున్నారు.


