కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా తాడేపల్లి మండలంలో 24.4 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా ఫిరంగిపురం మండలంలో 1 మి.మీ వర్షం పడింది. సగటున 5.6 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. చేబ్రోలు మండలంలో 19 మి.మీ., తుళ్ళూరు 18.2, తాడికొండ 17.4, మంగళగిరి 13, పెదకాకాని 5.2, గుంటూరు తూర్పు 1.4, గుంటూరు పశ్చిమలో 1.2 మి.మీ చొప్పున వర్షం పడింది.
ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు
డాక్టర్ పమిడిముక్కల విజయ
గుంటూరు మెడికల్: ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ 19వ వార్షిక సదస్సు ఈనెల 13 నుంచి 15 వరకు కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్లో విజయవంతంగా నిర్వహించినట్లు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి ప్రముఖ న్యూరాలజిస్టులు, స్ట్రోక్ నిపుణులు, పరిశోధకులు, ఆరోగ్య రంగ నిపుణులు పాల్గొన్నట్లు వెల్లడించారు. సదస్సులో డాక్టర్ విజయ ప్రెసిడెన్షియల్ ఓరియంటేషన్ ముఖ్య ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. 1990లలో థ్రోంబోలైటిక్ చికిత్స అందుబాటులోకి రాకముందు పరిస్థితుల నుంచి ప్రారంభించి, 1995లో 3 గంటల్లో క్లాట్ బస్టింగ్ థెరపీ ఆవిష్కరణ, 2005లో స్ట్రోక్ కేర్ అభివృద్ధి, 2015లో న్యూరో ఇమేజింగ్, మెకానికల్ థ్రోంబెక్టమీ పురోగతి వరకు జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎంపిక చేసిన రోగులకు 24 గంటల వరకు చికిత్స అవకాశాలు విస్తరించిన విషయాన్ని డాక్టర్ పి.విజయ ప్రస్తావించారు. అత్యంత ప్రేరణాత్మకంగా నిలిచి, 400 మందికి పైగా జాతీయ అంతర్జాతీయ ప్రతినిధుల స్టాండింగ్ అవేషన్ అందుకున్నట్లు తెలిపారు.
లక్ష్మీపురం: గుంటూరు అరండల్పేటలో నవ్య వారాహి ప్రైవేటు లిమిటెడ్, ట్రేడ్ దోస్త్ కంపెనీ పేర్లతో భారీ మొత్తంలో మోసం చేసి పరారైన నిర్వాహకుడిపై బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరండల్పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవ్య వారాహి ప్రైవేటు లిమిటెడ్, ట్రేడ్ దోస్త్ పేరుతో అరండల్పేట 16వ లైనులో అన్నం పూర్ణచంద్రరావు, మరికొంత మందితో కలిసి గోల్డ్, సిల్వర్ ట్రేడింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నామని, పెట్టుబడి పెట్టిన వారికి 20 నెలల్లో రూ. లక్షకు రూ. 2 లక్షలు కలిపి ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి అక్రమంగా వసూలు చేశారు. పెట్టుబడి పెట్టిన వారి పేర్లపై డ్రా తీసి 40 గ్రాముల బంగారం, తదితర స్కీమ్ల పేర్లతో పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇటీవల అన్నం పూర్ణచంద్రరావు తీరుపై అనుమానం వచ్చిన బాధితులు సంబంధిత డ్రాల గురించి నిలదీసే ప్రయత్నం చేయగా.. పూర్ణ చంద్రరావు పరారయ్యాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతా శివకోటేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


