దుబాయి తీసుకెళతానంటూ మోసం
మంగళగిరి టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు
మంగళగిరి టౌన్: దుబాయి తీసుకువెళతానని నమ్మించి మోసం చేసిన ఘటన మంగళగిరి పట్టణంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి పట్టణ పరిధిలోని పార్కురోడ్డుకు చెందిన జి.సాయి క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సాయికి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పసుపులేటి సాయికృష్ణ అనే వ్యక్తితో గత 20 సంవత్సరాలుగా పరిచయం వుంది. సాయికృష్ణ గతంలో దుబాయిలో ఉండి వచ్చాడు. దుబాయికి పంపిస్తానని, అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానంటూ కొంత ఖర్చు అవుతుందని చెప్పాడు. 2023వ సంవత్సరంలో రూ.లక్ష ఇవ్వమని సాయికృష్ణ అడగడంతో సాయి తన సోదరుని ఫోన్నుంచి ఫోన్ పే ద్వారా రూ.లక్ష నగదును బదిలీ చేశాడు. అప్పటి నుంచి దుబాయికి ఎప్పుడు పంపిస్తావని అడిగితే అదిగో ఇదిగో అంటూ సాయికృష్ణ కాలయాపన చేశాడు. ఇచ్చిన నగదును తిరిగి ఇవ్వమని అడిగినా ఇవ్వకుండా, నీకు చేతనైనది చేసుకో.. అంటూ బెదిరింపులకు దిగాడు. ఒక పథకం ప్రకారమే దుబాయిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఉద్యోగం ఇప్పించుకుండా మోసం చేసిన సాయికృష్ణపై తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్స్టేషన్లో ఆదివారం బాధితుడు జి.సాయి ఫిర్యాదు చేశాడు. దీనిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుంటూరు జీజీహెచ్లో చికిత్స
పెదకాకాని: వెనిగండ్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్క్రబ్ టైఫస్ లక్షణాలతో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నట్లు వెనిగండ్ల పీహెచ్సీ వైద్యాధికారి రామాంజిరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల గ్రామానికి చెందిన షేక్ రజాక్ నెల రోజులుగా వెనిగండ్ల ముస్లింపాలెంలో నివసిస్తున్నాడు. ఇప్పటి వరకు గ్రామ శివారులోని సుందరయ్యకాలనీలో ఉంటూ క్యాటరింగ్, మండపాల డెకరేషన్ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నాడు. అప్పడప్పుడు నీరసం, ఆయాసంతో స్థానిక పీహెచ్సీకి వెళుతూ ఉండేవాడు. ఈనెల 3వ తేదీన నీరసంతో వెనిగండ్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లగా వారి సూచన మేరకు అదేరోజు గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేసి జాయిన్ చేసుకున్నారు. ఈనెల 6వ తేదీన వచ్చిన వైద్య పరీక్షల రిపోర్ట్ ప్రకారం స్క్రబ్టైఫస్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. 26 ఏళ్ల రజాక్ ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా షేక్ బాజీ, వై.శ్యాంబాబు ఎన్నికయ్యారు. గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన సంఘ గుంటూరు జిల్లా 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు నాయకులు సోమవారం ఓప్రకటనలో తెలిపారు. జిల్లా ఆర్థిక కార్యదర్శిగా బి.హనుమంతప్రసాద్, గౌరవాధ్యక్షుడిగా ఏవీ ప్రసాద్ బాబు, రాష్ట్ర కౌన్సిలర్లుగా డి.పెదబాబు, ఎస్.రామచంద్రయ్య, డీకే సుబ్బారెడ్డి, వి.ప్రసాదరావు, కె.జోజప్ప, జి.దేవరాజు, జి.మల్లిఖార్జునరావు, డీఏ జోసఫ్ ఎన్నికయ్యారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు, ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి తోట మాల్యాద్రి నూత కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల అధికారిగా వి.భిక్షమయ్య వ్యవహరించారు.


