గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ కంటి వైద్య విభాగం పీజీ వైద్య విద్యార్థులు తమ ప్రతిభా, పాటవాలు చాటి రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు. ఆంధ్రప్రదేశ్ ఆప్తాల్మిక్ సొసైటీ గుంటూరు ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 21 వరకు రాష్ట్రస్థాయి కంటి వైద్యుల సమావేశాలు జరిగాయి. సమావేశాల్లో నిర్వహించిన క్విజ్ పోటీల్లో గుంటూరు వైద్య కళాశాల ఆప్తమాలజీ పీజీ వైద్యులు ప్రథమ స్థానాన్ని సాధించారు. ఈనేపథ్యంలో బుధవారం గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి ప్రథమ బహుమతి సాధించిన కంటి వైద్య విభాగం పీజీ విద్యార్థులను అభినందించారు. వారికి ఉత్తమ బోధన అందిస్తున్న కంటి వైద్య విభాగాధిపతి డాక్టర్ రవిబాబు, ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవిబాబుతోపాటు, కంటి వైద్యులు సాధన, ఉషాలత, వాణి, శ్రీదేవి, హారిక, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
ఉత్కంఠభరితంగా ‘జాతీయ చెస్ చాంపియన్షిప్’
చేబ్రోలు: ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్షిప్ – 2025 పోటీల్లో బుధవారం మూడో రౌండ్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. రైల్వేల జీఎం సయంతన్ దాస్ను కేవలం 12 ఏళ్ల ఆంధ్ర ప్రతిభావంతుడు అందమాల హేమల్ వర్షన్ ఓడించి సంచలనం సృష్టించాడు. మూడో రౌండ్ ముగిసే సరికి 27మంది ఆటగాళ్లు తలా మూడు పాయింట్లతో అగ్రగాములుగా ఉన్నారు. కేవలం 12 ఏళ్ల హేమల్ వర్షన్ సిసిలియన్ డిఫెన్స్లో జీఎం సయంతన్ దాస్పై ఘనవిజయం సాధించాడు. రూక్, మైనర్ పీస్ ఎండ్గేమ్లో రెండు అదనపు పాన్ల ఆధిక్యం సాధించిన హేమల్, నైట్ త్యాగం చేసి పాన్ను ఎనిమిదవ వరుసకు ప్రమోట్ చేయడంతో దాస్ రాజీనామా చేశారు. ఆంధ్ర ప్రముఖ ఆటగాడు జీఎం లలిత్ బాబు, ట్రాంపోవ్స్కీ ఆరంభంలో వేదాంత్ గార్గ్ (ఛత్తీస్గఢ్) పై 45 మూవ్లలో గెలిచాడు.
ఎన్నారై కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన
మేడికొండూరు: ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉండటం వల్ల మేడికొండూరులోని ఎన్నారై కళాశాల యాజమాన్యం విద్యార్థులను వేధిస్తోందని ఆరోపిస్తూ, బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల వద్ద భారీ ధర్నా జరిగింది. ఫీజులు చెల్లించకపోతే పరీక్ష ఫీజులు కట్టించుకోమని, అలాగే ప్రాక్టికల్ మార్కులు తగ్గిస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.పవన్ కుమార్, ఎస్.కె. సమీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని మండిపడ్డారు. ఎమ్మెల్సీగా ఉన్న ఆలపాటి రాజా కళాశాల యాజమాన్యంలో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం సమస్యపై స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యపై ఆలపాటి రాజా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి విద్యార్థులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఎ. యశ్వంత్, జిల్లా గౌడ్స్ కన్వీనర్ సౌమ్య, జిల్లా కమిటీ సభ్యులు అభి తదితరులు పాల్గొన్నారు.

క్విజ్ పోటీల్లో ఆప్తమాలజీ పీజీ వైద్యుల ప్రతిభ

ఎన్నారై కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన

ఉత్కంఠభరితంగా ‘జాతీయ చెస్ చాంపియన్షిప్’