
‘నీట్’కు విస్తృత ఏర్పాట్లు
గుంటూరు ఎడ్యుకేషన్ : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికై ఈనెల 4న జరగనున్న జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్–2025)కు విస్తృత రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 4,250 మంది విద్యార్థులకు 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల వద్ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉండటంతో విద్యార్థులు ఉదయం 11 గంటల కల్లా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1.30 తరువాత కేంద్రాల్లోనికి అనుమతించరు. నీట్ దరఖాస్తు సమయంలో అందజేసిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో పొందుపర్చిన నియమావళిని విధిగా పాటించాల్సి ఉంది.
విద్యార్థుల వస్త్రధారణపై ఆంక్షలు
● నీట్కు హాజరయ్యే విద్యార్థుల వస్త్రధారణపై ఎన్టీఏ ఆంక్షలు విధించింది. విద్యార్థినులు ముక్కు పుడక సహా చెవులకు దిద్దులు, చేతులకు గాజుల సహా ఎటువంటి ఆభరణాలను ధరించరాదు.
● చేతికి స్మార్ట్వాచీతో పాటు సాధారణ వాచీలను సైతం ధరించకూడదు.
● సమయాన్ని తెలుసుకునేందుకు వీలుగా కేంద్రాల్లో గడియారాలను ఏర్పాటు చేస్తున్నారు.
● విద్యార్థులు జీన్స్ ఫ్యాంట్లు వంటి వస్త్రాలను ధరించకుండా, సాధారణ దుస్తుల్లోనే రావాల్సి ఉంది. తలకు టోపీ, కళ్లకు బ్లాక్ సన్గ్లాసెస్ ధరించకూడదు.
● బ్లూటూత్ వాచీలు, సెల్ఫోన్లు, స్మార్ట్బ్యాండ్లు, పెన్నులు సహా ఇతర ఎటువంటి వస్తులను తమ వెంట తీసుకురాకూడదు.
విద్యార్థులు వీటిని వెంట తెచ్చుకోవాలి
● విద్యార్థులు ప్రింటవుట్ అడ్మిట్కార్డుతో పాటు నీట్ దరఖాస్తు సమయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పాస్పోర్ట్ సైజు ఫొటోను తమ వెంట తెచ్చుకోవాలి. మరొక పాస్పోర్ట్ సైజు ఫొటోను ఎగ్జామినేషన్ హాల్లో విద్యార్థుల హాజరు నమోదు చేసే సమయంలో అటెండెన్స్ షీట్పై అతికించాల్సి ఉంది. దీంతో పాటు పోస్ట్కార్డ్ సైజు వైట్ బ్యాక్ గ్రౌండ్తో కూడిన కలర్ ఫొటోను అడ్మిట్కార్డుతో పాటు డౌన్లోడ్ చేసుకున్న ప్రొఫార్మాపై అతికించి ఇన్వజిలేటర్కు అందజేయాలని నియమావళిలో పొందుపర్చారు.
● ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, రేషన్కార్డు, 12వ తరగతి అడ్మిషన్ కార్డులో ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపుకార్డును తీసుకెళ్లాలి. శారీరక వైకల్యం గల విద్యార్థులు సంబంధిత ఒరిజినల్ ధృవీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నులను కేంద్రాల్లోనే ఇస్తారు.
గుంటూరు జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు దరఖాస్తు చేసిన విద్యార్థులు 4,250 మంది ఉదయం 11 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతి మధ్యాహ్నం 1.30 గంటల తరువాత నో ఎంట్రీ విద్యార్థుల వస్త్రధారణ, ఆభరణాలపై ఆంక్షలు అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్, పోస్ట్కార్డు సైజు ఫోటోలతోపాటు, ఒరిజినల్ గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలి