అట్టడుగు వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ కృషి
గుంటూరు ఎడ్యుకేషన్: సమాజంలోని అట్టడుగువర్గాల అభ్యున్నతికి కాంక్షించిన జగ్జీవన్రామ్ అడుగుజాడల్లో నడవాలని జెడ్పీ సీఈవో కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. జెడ్పీ కార్యాలయంలో శనివారం మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈవో వి. జ్యోతిబసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హెనీ క్రిస్టినా మాట్లాడారు. జగ్జీవన్రామ్ జీవిత చరిత్ర, ఆశయాలను స్ఫూరిగా తీసుకుని ఉద్యోగులందరూ అంకితభావంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల పరిపాలనాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
గుంటూరు బార్ అసోసియేషన్
ఆధ్వర్యంలో ఘన నివాళి
గుంటూరు లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలోని గుంటూరు బార్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి. పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉప ప్రధానిగా జగ్జీవన్రామ్ సేవలను కొనియాడారు. కార్యక్రమానికి గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యంగళశెట్టి శివ సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. ఏపీ హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈవెన సాంబశివ ప్రసాద్, నాలుగవ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుకుమార్, బార్ కౌన్సిల్ మెంబర్ వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ న్యాయవాదులు పాల్గొన్నారు
బాబూజీని ఆదర్శంగా తీసుకోవాలి
ఏఎన్యూ: క్రమశిక్షణ, లక్ష్య సాధనలో బాబూ జగ్జీవన్రామ్ను యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఏపీ రోడ్ సేఫ్టీ విభాగ డీఐజీ సీహెచ్. విజయారావు తెలిపారు. నాగార్జున యూనివర్సిటీలోని బాబూ జగ్జీవన్రామ్ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం జయంతి వేడుకలు నిర్వహించారు. డీఐజీ విజయారావు ముఖ్య అతిథిగా హాజరై జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ సమాజంలో అన్ని అవాంతరాలను అధిగమించి అత్యున్నత స్థాయికి చేరి జగ్జీవన్రామ్ అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. విద్యార్థులంతా ఆయన బాటలో నడవాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం మాట్లాడుతూ బాబూ జగ్జీవన్రామ్, ఫూలే, అంబేడ్కర్ వంటి అహనీయుల సేవలు, ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత యువతపై ఉందని తెలిపారు. బాబూ జగ్జీవన్రామ్ అధ్యయనకేంద్రం డైరెక్టర్ ఆచార్య పీజే రత్నాకర్ మాట్లాడుతూ విద్యార్థిగా, సామాజిక ఉద్యమాల నాయకుడిగా, రాజకీయ నేతగా, ప్రజాప్రతినిధిగా జగ్జీవన్రామ్ విలక్షణమైన ప్రతిభను కనబరిచారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్, ఫూలే అధ్యయన కేంద్రాల డైరెక్టర్లు వై. అశోక్ కుమార్, ఎం. త్రిమూర్తిరావు, యూనివర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్ పి. బ్రహ్మాజీరావు, పీజీ పరీక్షల కోఆర్డినేటర్ ఎం. సుబ్బారావు, బాలుర వసతి గృహాల వార్డెన్ ఆచార్య మల్లికార్జున, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ కృష్ణారావు పాల్గొన్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం
జగ్జీవన్రామ్ పోరాటం
నగరంపాలెం: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు బాబూ జగ్జీవన్రామ్ అని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్రామ్ 118వ జయంతి వేడుకలను శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అధ్యక్షత వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, తాత్కాలిక మేయర్ షేక్ సజీల జ్యోతి ప్రజ్వలన చేసి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ జగ్జీవన్రామ్ అడుగుజాడల్లో కూటమి ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ మహానీయుల జీవితాలను పిల్లలు ఆదర్శంగా తీసుకుని ఎదిగేలా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉందని చెప్పారు. ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ మాట్లాడుతూ బిహార్లోని మారుమూల గ్రామంలో జన్మించి, ఉప ప్రధాని స్థాయికి ఎదిగి జగ్జీవన్రామ్ చరిత్ర సృష్టించారని అన్నారు. దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ అమరావతిలో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఆర్డీఓ శ్రీనివాసులు, డీఆర్ఓ ఖాజావలి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాబాయి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి, కార్పొరేటర్ పోతురాజు సమత, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ కృషి
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ కృషి
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ కృషి


