గుంటూరు వెస్ట్: ఐక్యరాజ్యసమితి 2025–26 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా(ఐవైసీ) ప్రకటించిందని, దీని ప్రణాళిక కోసం జిల్లా కమిటీలు ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో జిల్లా కో–ఆపరేటీవ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ ఐవైసీ సంవత్సర లక్ష్యాలు, జిల్లాస్థాయి ప్రణాళికలు, వార్షిక కార్యాచరణ రూపొందించాలన్నారు. దీనికి సంబంధించి కమిటీ క్యాలెండర్ ఆమోదించిందని తెలిపారు. జిల్లాలో ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల వివరాలతోపాటు, కొత్తగా కమిటి సభ్యుల వివరాలు కంప్యూటరైజేషన్ ప్రక్రియను నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వెంటనే పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్ నెలలో ఐవైసీ యాక్షన్ ప్లాన్ చేయాల్సిన యాక్టివిటీస్కు సంబంధించి ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మహిళలకు హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు. మల్టీపర్పస్ స్పెషలిటి సెంటర్ గోడౌన్లకు ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక ప్రాజెక్టు కింద ఏదైనా కవర్ చేయడానికి అవకాశం ఉందో లేదో చూడాలన్నారు. జిల్లాలో పీఏసీలు నాబార్డు ద్వారా అందించిన ఆర్ధిక సహాయంతో నిర్మించిన మల్టీపర్పస్ గోడౌన్లలో స్థానిక రైతులు వారి పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీల ద్వారా అందించిన రుణాలు, ఓవర్జ్యూస్ యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని రికవరీ చేయాలన్నారు. ఏపీ పాడిపరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ వివిధ మండలాల్లో మహిళ పాడి సహకార సంఘ 15 గ్రామాలను గుర్తించామన్నారు. జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో 101 ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సంఘాలు పనిచేస్తున్నాయని జేసీ వివరించారు. సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి విరాచారీ, డీపీఓ నాగసాయికుమార్, వ్యవసాయ శాఖ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు, జీడీసీసీ బ్యాంకు సీఈఓ కృష్ణవేణి, అధికారులు పాల్గొన్నారు.
మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్కుమార్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): మిర్చికి క్వింటాకు రూ.25వేలు చొప్పున గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కొత్తపేటలోని జిల్లా సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.11,781లు మద్దతు ధర అని ప్రకటించి మిర్చి రైతులకు తీరని అన్యాయం చేశాయన్నారు. ప్రభుత్వానికి రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదని ఆవేదన చెందారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ప్రతి రైతుకు అన్నదాతా సుఖీభవ ద్వారా రూ.20 వేలు ఇస్తానని ప్రకటించి ఇప్పటికీ ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
వేసవిలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలి
పలు సూచనలు చేసిన సహాయ కార్మిక శాఖ అధికారి
నరసరావుపేట: వేసవిలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్చార్జి ఆఫీసర్, సహాయ కార్మికశాఖ అధికారి జి.ధనలక్ష్మి కోరారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలకు అనుగుణంగా కార్మికుల రక్షణకు యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరారు. కర్మాగారాలు, దుకాణాలు, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధిహామీ కూలీలు, వలస కూలీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే పలు సూచనలు చేశామన్నారు. పనిచేసే సమయం మార్చి పనిప్రాంతంలో చల్లని నీడ, నీటివసతి కల్పించాలని తెలిపారు. వైద్యసిబ్బందితో సమన్వయం చేసుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ప్లూయిడ్స్, అత్యవసర మందులు సమకూర్చుకోవాలని చెప్పారు.