
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపైనే కాకుండా, 1971 తర్వాత మొదటిసారిగా పాకిస్తాన్ పై, అది కూడాపంజాబ్ నడిబొడ్డున ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడులు ప్రారంభించడంతో ఇప్పుడు యుద్ధ ఢంకా గట్టిగా మోగుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ ఒక సైనిక విన్యాస క్రమంలో యుద్ధట్యాంక్ పైకి ఎక్కి, తమపై ఏదైనా భారతీయ ‘సైనిక దురదృష్టకర ఘటన’ జరిగితే, ‘తక్షణ స్పందన’తో దాన్ని ఎదుర్కొంటామని ప్రకటించారు. కానీ భారత్ ప్రతిదాడి చేశాక పాక్ ఆర్మీ చీఫ్ ప్రతిష్ఠ దెబ్బతింది.
అసీమ్ మునీర్ అన్నట్లుగా, భారత ప్రతి దాడి నిజంగా ‘సైనిక దురదృష్టకర ఘటనా’? ఏ రకంగా చూసినా, అది నిజం కాదు. ఇది చాలా కచ్చితమైన ఉగ్రవాద నిరోధక దాడి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, మన ప్రతిదాడి ఉద్రిక్తతలు పెంచేది కాదనీ, పాక్లోని ఏ సైనిక లక్ష్యాన్నీ ‘ఆపరేషన్ సిందూర్’ తాకలేదనీ తెలిపారు. సందేశం స్పష్టంగా ఉంది. పౌరులను, భారత సైన్యాన్ని తాకాలా వద్దా అనే విషయాన్ని పాకిస్తాన్ నిర్ణయించు కోవాల్సి ఉండింది. ఎందుకంటే, భారత్లో ఉగ్రవాద శిబిరాలు లేవు. అయినా సరే, పాక్ సైన్యం ఏకంగా భారతీయ నగరాలపై, జనావా సాలపై, విమానాశ్రయంపై నేరుగా దాడికి దిగింది. తర్వాత ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నాం.
జనరల్ మునీర్ దూకుడు
పాక్ సైనిక దాడులకు ఒక రోజు ముందే భారత హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ కసరత్తులకు ఆదేశించింది. భారతదేశం పూర్తి యుద్ధానికి సిద్ధమ వుతోందని ఇది సూచిస్తుంది. అయితే, ఇది నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ) లేదా నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్ఎస్ఎస్) వంటి స్వచ్ఛంద సంస్థలను మాత్రమే సమీకరించే రక్షణాత్మక చర్య. జాగ్రత్తగా చేపట్టిన ఈ ప్రయత్నాలన్నింటికీ భిన్నంగా, పాకిస్తాన్ చేపట్టిన సైనిక దాడి ఆ దేశానికి ఏ ప్రయోజనమూ కలిగించలేదు.
జనరల్ మునీర్ దూకుడు మీద ఎటువంటి సందేహం లేదు. ఉద్దేశపూర్వకంగా మతతత్వ రంగు పులుముతూ, పహల్గామ్ ఉగ్రవాద దాడికిముందు ఇస్లామాబాద్లో ఏప్రిల్ 18న జరిగిన ఒక కార్యక్రమంలో ‘రెండు దేశాల సిద్ధాంతం’పై ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం భారతదేశాన్ని రెచ్చగొట్టింది. ఉగ్రదాడిపై గట్టి చర్యకు దిగాలనే దృఢ సంకల్పాన్ని భారత్కు కలిగించింది.
మునీర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు దాదాపు 66 శాతం పెరిగి, తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఎంతోమంది అనుచరు లున్న మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ను, ఆ పార్టీ నేతలను పాక్ సైనిక వ్యవస్థ జైలులో పెట్టించింది. మాజీ ఐఎస్ఐ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్నూ, తన సొంత ప్రజలపై కాల్పులు జరప డానికి నిరాకరించిన మరో జనరల్తో సహా మరి కొందరు సీనియర్ అధికారులనూ జైల్లో పెట్టింది. మునీర్ తన ప్రతిష్ఠను తానే చెరుపుకున్నారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు, ఐఎస్ఐ డీజీగా ఉన్న తనను అమర్యాదగా బయటకు నెట్టివేయడం తనకు జరిగిన ఘోరావమానంగా మునీర్ భావించారు. దాంతో సరైన అవకాశం కోసం చాలా కాలం వేచి ఉండి చివరకు కొరడాను ఉపయోగించారు.బాలాకోట్ సర్జికల్ దాడులు జరిగినప్పుడు పాక్ స్పందన సంయమనంతో ఉండింది. అప్పుడు పాక్ ఆర్మీ చీఫ్గా ఉన్న జనరల్ బాజ్వా పూర్తి భిన్నమైన మనిషి. ఆయన ఇండియాతో వాణిజ్యసంబంధాలను కోరుకున్నారు. కానీ ఇప్పుడు భారత్– పాక్ ఘర్షణ భిన్న స్థాయికి చేరుకుంది.
పట్టించుకునే స్థితిలో లేని ప్రపంచం
విస్తృత ప్రాంతీయ సంఘర్షణను రెచ్చగొట్టవద్దని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ భారతదేశానికి సలహా ఇచ్చారు. అలా రెచ్చగొట్టిన పక్షంలో చైనా జోక్యం చేసుకోవచ్చనే హెచ్చరిక దీంట్లో ఉండవచ్చు లేదా ఈ ప్రకటనకు పెద్దగా అర్థం ఏమీ ఉండకపోవచ్చు.
కానీ, అగ్రశ్రేణి దేశాల నాయకత్వంలో ఉన్న గందరగోళం కనివిని ఎరుగనిది. తూర్పున, మాస్కో మరింత దారుణమైన ఇబ్బందుల్లో ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు మద్దతు ఇచ్చిన తర్వాత, తన వైఖరిని కాస్త సవరించి మధ్యవర్తిత్వం అందించడానికి ప్రయత్నించారు. ఇది ఢిల్లీకి ఏమాత్రం నచ్చదని క్రెమ్లిన్ కు తెలుసు. కానీ క్షిపణుల భారీ సమూహాన్ని మనకు రష్యా పంపడం ప్రోత్సాహకరంగా ఉంది. అయితే రష్యన్ సైనిక భుజం ఇప్పుడుఅందుబాటులో లేదు.
ఆర్థిక మాంద్యం, తీవ్రమైన అంతర్గతఇబ్బందులతో పోరాడుతున్న యూరోపియన్ యూనియన్ సంయ మనం వహించాలని ప్రకటించింది. ఇజ్రాయెల్, భారతదేశం పట్ల క్రియాశీలంగా, బలంగా సానుభూతి చూపుతున్నప్పటికీ, గాజాలో గందరగోళాన్ని చూస్తే ఇజ్రాయెల్ ఇక్కడ నిర్వహించే పాత్రచాలా తక్కువేనని చెప్పాలి. మొత్తం మీద, ప్రపంచం ఈ యుద్ధాన్ని పట్టించుకునే స్థితిలో లేదు.
ఇప్పుడు ఇరు దేశాల సైనిక ఘర్షణను తగ్గించడానికి చైనా ప్రభుత్వం గనక పూనుకుంటే అదొక పరిహాసం అవుతుంది. పాకిస్తాన్లో చైనా ప్రాబల్యం నిస్సందేహంగా ఉందనేది జగమెరిగిన సత్యం. మరోవైపున చైనానే పాకిస్తాన్ యుద్ధానికి నిధులుసమకూర్చే అవకాశం ఉంది. దేశాలు చాలా అరుదుగా హేతుబద్ధంగా వ్యవహరిస్తాయి. అలా సమకూర్చిన నిధులు వేరే విధంగా మళ్లే అవకాశం ఉంది. ఇది ప్రమాదకరమని ఢిల్లీకి పూర్తిగా తెలుసు.
ఇరు దేశాలు ఏం చేయొచ్చు?
అయితే, ఇప్పుడు కూడా ఆశ ఉంది. అంగీకరించని నిజం ఏమిటంటే– భారతదేశం, పాకిస్తాన్ తమ సైనిక చర్యల విషయంలో అనేక పాశ్చాత్య దేశాల కంటే గతంలో చాలా పరిణతితో వ్యవహరించాయి. గత మూడు యుద్ధాలలోనూ ఏవీ పౌర లక్ష్యాలపై పెద్ద ఎత్తున బాంబు దాడి చేయలేదు. భారతదేశ క్షిపణి పాకిస్తాన్ ను తాకినప్పుడు, సైన్యం ప్రతిస్పందన సాపేక్షంగా తేలికగా ఉంది. ప్రస్తుతానికి, రెండు వైపులా సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ మాట్లాడుతున్నారు. అది ఒక ఆశాజనకమైన సంకేతం. ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసీమ్ మాలిక్ను పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా నియ మించడం కూడా అంతే. రెండు దేశాల నిఘా సంస్థల అధిపతులు మాట్లాడుకోవాలని నిర్ణయించుకుంటే, అది పెద్ద విషయమే.
ఉపఖండం నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి రెండు దేశాలు ఉమ్మడి చొరవను ప్రకటించవచ్చు. పాకిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఉగ్రవాద ప్రేరేపక దేశం అనే ఆరోపణనుపదే పదే ఎదుర్కొంటున్నందున ఇదేమీ అంత అసాధ్యమైనది కాదు. ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధాలు ప్రస్తుత పరిస్థితుల్లో సాగేలా లేవు. కాబట్టి, పాత్రధారులు, సూత్రధారులతో సహా ఉగ్ర వాదానికి సంబంధించిన ప్రతిదానినీ దెబ్బతీయడమే ఏకైక ఎంపిక. ఇది ప్రమాదకరం. మొత్తంగా చివరి పాఠం మాత్రం ఇదీ: మీ సొంత యుద్ధాలను మీరే చేసుకోవాలి. ‘ఆపరేషన్ సిందూర్’ ఇప్పుడే దాన్నే తెలియజెప్పింది.
-వ్యాసకర్త డైరెక్టర్ (రిసెర్చ్), సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ ‘ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
-తారా కార్థా