ప్రజాభీష్టాన్ని వెక్కిరించిన పీడకలకు 50 ఏళ్లు | Union Minister G Kishan Reddy on Emergency | Sakshi
Sakshi News home page

Kishan Reddy: ప్రజాభీష్టాన్ని వెక్కిరించిన పీడకల

Jun 25 2025 3:52 PM | Updated on Jun 25 2025 5:59 PM

Union Minister G Kishan Reddy on Emergency

సందర్భం

50 ఏళ్ల క్రితం దేశంలో.. అవినీతి, నిరుద్యోగం, అధిక ధరలకు వ్యతిరేకంగా.. జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో  ‘సంపూర్ణ క్రాంతి’ పేరుతో ఉద్యమం ఊపందుకుంది. ప్రజలంతా నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీపై ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్న పరిస్థితులవి. అదే సమయంలో.. అలహాబాద్ హైకోర్టు కూడా ప్రచారంకోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగంపై ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. ఒకవైపు ప్రజాగ్రహం, మరోవైపు కోర్టు తీర్పుతో.. దేశవ్యాప్తంగా ఉద్యమం తీవ్రమైతే తన పరిస్థితేంటన్న అసహనంతో, అధికారాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఇందిరాగాంధీలో పెరిగిపోయింది. దీంతో సరిగ్గా 50 ఏళ్ల క్రితం, 1975 జూన్ 25 నాడు ఉన్న దేశంలో ‘ఎమర్జెన్సీ’ విధించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో ఈ పవిత్రమైన ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ.. ప్రజల హక్కులను హరిస్తూ, ప్రజాస్వామ్యపు నాలుగో మూలస్తంభమైన పత్రికాస్వేచ్ఛకు తిలోదకాలిస్తూ.. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ (Indira Gandhi) తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలో ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది.

దీన్ని ప్రశ్నించిన ఎందరోమంది మహనీయులను, సామాన్య ప్రజలను నిర్బంధిస్తూ.. దేశాన్ని ఓ జైలు గదిగా మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను భయభ్రాంతులకు గురిచేస్తూ.. కేవలం తన ఎన్నికను ప్రశ్నించారన్న అక్కసుతో యావద్భారతాన్ని, మన ప్రజాస్వామ్య విలువలను ప్రమాదంలోకి నెట్టేశారు ఇందిరాగాంధీ. 25 జూన్ 1975 నుంచి 21 మార్చ్ 1977 వరకు దాదాపు 21 నెలలపాటు.. కుట్రలు, కుత్రంత్రాలతో ప్రజలను, ప్రజానాయకులను చిత్రహింసలు  పెట్టారు. కాంగ్రెస్ నిరంకుశత్వ పాలనకు ‘ఎమర్జెన్సీ’ ఓ మచ్చుతునక.

అందుకే ఎమర్జెన్సీ దేశ చరిత్రలో అతిపెద్ద చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. జయప్రకాశ్ నారాయణ, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అడ్వాణీ వంటి ఎందరో మంది నేతలను మీసా (మెయింటేనెన్స్ ఆఫ్ ఇంటర్నర్ సెక్యూరిటీ యాక్ట్) చట్టం కింద ఎక్కడికక్కడ నిర్బంధించబడ్డారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) తోపాటుగా లక్షకు పైగా జాతీయభావజాలం ఉన్న నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలను ఎలాంటి విచారణ లేకుండా మీసా కింద జైల్లో పెట్టారు.

ఇది కాకుండా.. ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాజ్యాంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. 48 ఆర్డినెన్సులు తీసుకొచ్చిమరీ రాజ్యాంగంలో తమకు ఇష్టమొచ్చిన మార్పులు చేశారు. ఎన్నికలను ఏడాదిపాటు వాయిదా వేసి నియంతృత్వంతో ఇందిర మరోసారి తానే పగ్గాలు చేపట్టారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. నియంతృత్వ పోకడలతో బలవంతంగా కుటుంబనియంత్రణ చర్యలను అమలు చేశారు. జనాభా పెరగడం కారణంగా.. పేదరికం పెరుగుతోందని ఇందిర ప్రభుత్వం తమ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ‘రోటీ, కపడా ఔర్ మకాన్’ నినాదాన్ని ఎన్నికల కోసం వాడుకోవడం తప్ప నిజంగా పేదరికాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ పాలనలో ఇసుమంత ప్రయత్నం కూడా జరగలేదు.

పరమపవిత్రమైన రాజ్యాంగాన్ని అవమానించేలా.. మన చరిత్రను, మన మూల విలువలను, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రశ్నించేలా ఆ 21 నెలలపాటు దేశవ్యాప్తంగా పెనువిధ్వంసం జరిగింది. ఈ విధ్వంసాన్ని ఇందిర స్వయంగా పర్యవేక్షించడం నాటి నియంతపోకడలకు అద్దం పడుతుంది.

కానీ, 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిరంకుశత్వపు ఆలోచనలు, నియంత పోకడలను రూపుమాపి.. భారతీయ అస్తిత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నం ప్రారంభమైంది. మొదటిసారి పార్లమెంటులోకి వెళ్తున్న సందర్భంలో పార్లమెంటు భవనం మెట్లను నమస్కరించడంతో మొదులుకుని.. చోళుల కాలం నాటి గ్రామ పార్లమెంటు వ్యవస్థకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు బాటలు వేసిన తమిళనాడు, కాంచీపురం జిల్లాలోని ఉత్తర్‌మేరూర్ గ్రామం గురించి ప్రజల ముందుకు తీసుకురావడం, బసవేశ్వరుడి అభినవమండపానికి ప్రాచుర్యం కల్పించడం, ప్రతిష్టాత్మకమైన సెంగోల్‌ను నూతన పార్లమెంటు భవనంలో ప్రతిష్టించడం.. ఇవన్నీ ప్రాచీన భారతంలోని ప్రజాస్వామ్య పద్ధతులను ప్రజలకు మరోసారి గుర్తుచేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

అదే సమయంలో.. రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అందిన హక్కులను వారికి కల్పిస్తూనే, వారి బాధ్యతలను కూడా గుర్తుచేశారు. హక్కులు, బాధ్యతల సమన్వయంతో దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరింది. ప్రజలను చైతన్యవంతులను చేస్తూనే ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకెళ్లిన కారణంగా.. సత్ఫలితాలు వస్తున్నాయి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదే.. 2 అక్టోబర్, 2014 నాడు ‘స్వచ్ఛభారత్’ అభియాన్‌ను ప్రారంభించి.. ప్రజల మద్దతు కావాలని కోరింది. దీనికి ‘నభూతో, నభవిష్యత్’ అన్నట్లుగా ప్రజలు అండగా నిలిచారు.

‘స్వచ్ఛత మన బాధ్యత’గా భావించి రాజ్యాంగం చెప్పిన పౌరబాధ్యతలను నిర్వర్తించారు. ఇది ప్రజాభాగస్వామ్యపు తొలి విజయం. ఆ తర్వాత 2015లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించినపుడు.. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆ తర్వాత నుంచి ఈ కార్యక్రమం ఏడాదికేడాది కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ప్రజలు ప్రభుత్వాన్ని తమదిగా భావించారు (ఓన్ చేసుకున్నారు) కాబట్టే.. ఇలాంటి కార్యక్రమాలకు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నారు. పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలి.. కాబట్టి ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నవారు సబ్సిడీ వదులుకోవాలని ప్రధానమంత్రి కోరితే.. కోటిమందికి పైగా స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకున్నారు. ప్రపంచ చరిత్రలోనే ఇలా పెద్దసంఖ్యలో ప్రజలు సమాజం కోసం సబ్సిడీని వదులుకున్న సందర్భం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు.

పేదరికంపై గత ప్రభుత్వాలు చెప్పిన మాటలకు చేసిన చేతలకు పొంతన లేదు. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదేళ్లలో దాదాపు 27 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. దీంట్లో సమాజంలోని ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గం కూడా తమ సబ్సిడీలను వదులకుని సహకరించడం.. దేశాభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ అందిస్తున్న సహకారానికి నిదర్శనం. కరోనా టీకా విషయంలోనూ రాజకీయ దురుద్దేశాలతో ప్రతికూల వార్తలను ప్రసారం చేసినా.. ప్రజలంతా మోదీపై విశ్వాసంతో టీకాలు తీసుకున్నారు. ‘డిజిటల్ ఇండియా’తో ఆర్థిక వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందన్న సందర్భంలోనూ స్వచ్ఛందంగా ప్రజలు సహకరించారు. ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి చేర్చేందుకు మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా అకౌంట్లు ఉండాలన్న ప్రధాని మోదీ సంకల్పానికీ భారీ స్పందన వచ్చింది. భారతదేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి పిలుపునిస్తే.. ఇందులోనూ దేశమంతా ఏకతాటిపైకి వచ్చిన ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు.

చైతన్యవంతమైన సమాజంలో ప్రజలకు తమ హక్కులు, బాధ్యతలపై సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. దీని ఆధారంగానే ప్రజలు చౌకీదార్లుగా బాధ్యతా వ్యవహరిస్తారు. ఇలా అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే.. ‘ఎమర్జెన్సీ’ వంటి పరిస్థితులు తలెత్తవు. ప్రజలకు హక్కులను కల్పిస్తూ, వారి బాధ్యతలను గుర్తుచేస్తూ వారి ఆకాంక్షలకు, రాజ్యాంగ విలువలకు అనుగుణంగా వ్యవహరిస్తే ప్రజల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ఇలా ప్రజల సహకారం, వారి భాగస్వామ్యంతో తీసుకునే నిర్ణయాలతో ‘ఎమర్జెన్సీ’కి తావులేని పరిస్థితులు నెలకొంటాయనడంలో సందేహం లేదు. 

చ‌ద‌వండి: ఆ 'చీక‌టి' కోణానికి మ‌రోవైపు..

50 ఏళ్ల క్రితం ‘ఎమర్జెన్సీ’ దేశ ఆర్థిక, సామాజిక, శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థను విధ్వంసం చేసి ప్రజల్లో భయాందోళనలకు రేకెత్తించింది. కానీ ప్రజలు తమకు ఏం కావాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కారణంగా.. వారి సహకారంతో ఇవాళ ‘ఆత్మనిర్భర భారత్’ వైపు వడివడిగా అడుగులు వేస్తూ.. వికసిత్ భారత్ 2047 (Viksit Bharat 2047) స్వప్నాల సాకారం కోసం ముందుకెళ్తున్నాం. ప్రభుత్వ విధానాలతోపాటుగా.. ప్రజల భాగ్వస్వామ్యం ఉన్నప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమన్న స్వర్గీయ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఆలోచన స్ఫూర్తితో దేశమంతా ఈ దిశగా ముందడుగేయాల్సిన అవసరం ఉంది.

- జి. కిషన్‌ రెడ్డి
కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement