
కామెంట్
శశి థరూర్ను కాంగ్రెస్ గొప్ప సొత్తుగా భావిస్తుందని అను కున్నా. పార్టీకున్న అత్యంత విలు వైన సభ్యులలో ఒకరిగా,తామెంతో గర్వించదగిన వ్యక్తిగా ఆయన్ను గౌరవిస్తుందని భావించా. కానీ, పార్టీ ఆయనను ఒక ద్రోహిగా పరిగణిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక తిరుగుబాటు దారునిగా, కట్టు బాటు తప్పిన వ్యక్తిగా చూస్తోంది. నాయకత్వం థరూర్ పట్ల ముభావంగా, అంటీ ముట్టనట్లుగా ఉండటమే కాదు, అసలు ఆయన పొడ గిట్టనదిగా వ్యవహ రిస్తున్నట్లు కనిపిస్తోంది.
అది అసూయతోనా? అభద్రతా భావంతోనా? లేక శత్రు త్వంతోనా? అనేక మంది కాంగ్రెస్ నాయకులకు అనేక స్థాయిలలో శశి ఎసరుపెట్టగలిగిన వ్యక్తిగా ఉన్నారనడంలో నాకెలాంటి సందేహమూ లేదు. శశిలో కనిపించే అధునా తనత్వం, వాక్పటిమ లేనివారు ఆయన్ని చూసి అసూయ పడవచ్చు.
సొంతంగా విజయం సాధించగలగడంపైన కానీ, అర్హతలపైన కానీ నమ్మకం లేనివారు అభద్రతా భావానికి లోనవడం కూడా సహజం. శశికున్నంత ప్రతిభ, ప్రాచుర్యం తమకూ ఉన్నాయని, తాము ఆయనకు ఏమీ తీసిపోమని భావించేవారు ఆయనను ఒక ప్రత్యర్థిగా భావించవచ్చు. ఆ మూడు రకాలవారూ శశిని పార్టీ నుంచి బయటకు గెంటే యలేకపోయినా, ఆయన ప్రాబల్యాన్ని, స్థాయిని తగ్గించా లని బలంగా కోరుకుంటున్నారు.
రాజకీయాల్లో ఇదంతా అనివార్యమేనని మీరు అను కోవచ్చు. మనం తరచూ చూస్తున్న తెరచాటు, వంచనా యుత రాజకీయాల్లో ఇది మామూలేనని అనుకోవచ్చు. ఇతర పార్టీలలోని యువ ప్రతిభావంతులను ఆ పార్టీలలోని సహ చరులు సమానంగా చూస్తున్నారు. కనీసం, వారిని కించ పరచే మార్గాలను అనుసరించడం లేదు. సగటు మానవులు, తమను మించి ఎదిగిపోగలరని భావించినవారిని చూసి సహించలేరు.
అందులోనూ, రాజకీయ నాయకుల విషయంలో అది మరింత వాస్తవం. నేను దానితో విభేదించడం లేదు. దానిని అర్థం చేసుకోగలను. శశిలోని ఆత్మవిశ్వాసపు చిరునవ్వు, అతిశయం... మిగిలిన నాయకులకు చాలా కాలంగా కంటగింపుగా ఉండవచ్చు. లోలోపల కోపంతో రగిలిపోతూ ఉండవచ్చు. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా, ఆయన చాలా మంది శత్రువులను పోగేసుకున్నారు.
కానీ, భారత దేశపు వాణిని వినిపించేందుకు శశి విదే శాలలో ఉన్నప్పుడు, అదీ ఆయనకు అప్పగించిన బాధ్యత లను అద్భుతంగా నిర్వహిస్తున్నప్పుడు ఆడిపోసుకోవడమే అర్థం కాకుండా ఉంది. ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం, విలన్గా చిత్రించడమే విస్మయం కలిగిస్తోంది.
ఇది ఆత్మవినాశనాన్ని కొనితెచ్చుకోవడమే అవు తుంది. అటు కాంగ్రెస్ పార్టీ గానీ, ఇటు ఆ పార్టీలోని కొందరు వ్యక్తులు గానీ దానివల్ల సంతరించుకున్న ప్రతిష్ఠ ఏమీ లేదు. పైగా, వారు సంకుచిత మనస్కులుగా, స్ఫూర్తిని ప్రదర్శించలేని వారుగా, ఇంకా చెప్పాలంటే బుద్ధిలేని వారుగా ముద్రను మూట గట్టుకుంటున్నారు.
పాకిస్తానీ తండాలు ఉగ్రదాడులకు పాల్పడినపుడు, ప్రతిగా గతంలోనూ భారత్ నియంత్రణ రేఖను దాటిన దృష్టాంతాలు ఉన్నప్పటికీ, అనుకోకుండానో లేదా ఉద్దేశపూర్వకంగానో శశి వాటిని మరచిపోవడమో లేదా పట్టించుకోకపోవడమో చేసి నప్పటికీ, ఇది ఆయనపై విమర్శలకు దిగడానికి మాత్రం సరైన సమయం కాదు.
ఇది శశిని సరిదిద్దవలసిన సందర్భం అంతకంటే కాదు. శశి విదేశాల్లో ఉన్నప్పుడు, ప్రజా బాహుళ్యం మధ్య లేనపుడు చేయవలసిన పని కాదు. శశి మన దేశ ప్రజలకు ప్రశంసలను, అభినందనలను గడించి పెడుతున్న సమయంలో చేయాల్సిన పని అస్సలు కాదు. ఆ మూడింటి దృష్ట్యానూ ఈ సమయంలో ఆయనపై విమర్శ లకు దిగడం ఆత్మహత్యా సదృశమే అవుతుంది.
మరొకటి, శశిపై ఇపుడు చేస్తున్న విమర్శలకు దేశ పౌరుల నుంచి వత్తాసు లభించడం లేదు. ఇపుడే కాదు, శశిపై అటువంటి ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించకపోవచ్చు. ప్రజలు కూడా స్వాగతిస్తారని, సానుకూలంగా స్పందిస్తారని గట్టిగా భావించినపుడు మాత్రమే చతురత కలిగిన ఏ రాజకీయ పార్టీ అయినా బహిరంగంగా ఆయనను మందలించే ప్రయత్నం చేయవచ్చు.
ఈసారి పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. కాంగ్రెస్ తనను తాను నవ్వులపాలు చేసుకుంది. శశిని కొనియాడేవారు ఇదివరకే కోకొల్లలుగా ఉన్నారు. ఇపుడు అభినందన చందనాలు ఆయనకు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడ్డాయి. ప్రత్యర్థులను సున్నాలో ఉంచి, ఆయన మ్యాచ్ గెలిచే స్థితిలో ఉన్నారు.
నిజానికి, కాంగ్రెస్ ప్రతిష్ఠను మూటగట్టుకునేందుకు ఇది బంగారం లాంటి అవకాశాన్ని తెచ్చిపెట్టింది. దాన్ని చేజేతులా పాడుచేసుకుని కాంగ్రెస్ దోషిలా నిలిచే సంకటంలో పడింది. కాంగ్రెస్ శాంతంగా, ఆవేశరహితంగా ఆలోచించుకుని ఉంటే, వ్యూహాత్మకంగా, యుక్తితో వ్యవహ రిస్తూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేయగలిగిన, దెప్పిపొడుస్తూ కవ్వించగలిగిన స్థితిలో ఉండగలిగేది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. కొంత మాయోపాయాన్ని ప్రదర్శిస్తూ అయినా గడసరిగా వ్యవహరించి ఉండవలసింది.
శశిని ఆడిపోసుకునే బదులు బాహాటంగా ప్రశంసించి ఉండవలసింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పత్రికా సమా వేశాన్ని ఏర్పాటు చేసి, ‘చూడండి! శశి థరూర్ వంటి కాంగ్రెస్ ఎంపీలు దేశ సేవకు నిస్వార్థంగా ఎలా తరలివెళుతున్నారో! కాంగ్రెస్ నాయకుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఇది నిరూపిస్తోంది. వారు లేనిదే, భారతదేశ అవసరాలు తీరేవా?’ అని చెప్పుకొని ఉండాల్సింది. ఆ విధంగా, కాంగ్రెస్ తన భుజాన్ని తానే తట్టుకుని ఉండాల్సింది. దాన్ని ఎవరూ తప్పు పట్టేవారు కాదు. పైగా, చాలా మంది ప్రజలు సంతోషంగా దానికి సమ్మతి తెలిపేవారు.
కాంగ్రెస్ మరో అడుగు ముందుకు వేసి, ‘మాతో సరిపోల్చదగినవారు బీజేపీలో ఎవరూ లేరు. భారత్ గొంతు కను వినిపించాలంటే, కాంగ్రెస్ గొంతుకల వల్లనే అవుతుంది. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన దేశమైన అమె రికాకి, ఈ కారణంగానే ఒక కాంగ్రెస్ నాయకుని నేతృత్వంలో ప్రతినిధి బృందం వెళ్ళింది’ అని కూడా ఘనంగా చాటుకుని ఉండవచ్చు.
నా ఈ మాటల్లో కొంత అతిశయోక్తి ఉండవచ్చు. కానీ, నేను చెప్పదలచుకున్న సంగతికి అదొక్కటే మార్గం. ఇది ఖ్యాతిని దక్కించుకోవలసిన సమయం. అదీ స్నేహపూర్వక మైన మార్గాల్లో ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ పైచేయి సాధించి ఉండవచ్చు. కానీ, శశి మీద వ్యతిరేకతతో అందివచ్చిన అవకాశాన్ని అది కాలరాసుకుంది. దీన్ని అంతకంటే ఎలా భావించగలం? అదే కాంగ్రెస్ ప్రారబ్ధం!
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్