వైద్య విద్య ప్రక్షాళన అత్యవసరం | Sakshi
Sakshi News home page

వైద్య విద్య ప్రక్షాళన అత్యవసరం

Published Tue, Jun 27 2023 3:24 AM

Purification of medical education is imperative - Sakshi

ప్రస్తుతం ఒక ఎంబీబీఎస్‌ విద్యార్థికి ప్రాక్టికల్‌ అంశాలపై అవగాహన నాస్తి. పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌  కోర్సులో చేరడమెలా అన్నదానిపైనే విద్యార్థి దృష్టి కేంద్రీకృతమై ఉంటోంది. కానీ ఎంబీబీఎస్‌ సీట్లతో పోలిస్తే పీజీ సీట్లు మూడొంతుల వరకూ తక్కువ. అయినా అత్యధికులు పీజీ కోసం పోటీపడుతూంటారు. సహజ సామర్థ్యం, అభిరుచులకు అనుగుణంగా పీజీ కోర్సులను ఎంచుకునే సౌలభ్యం వారికి ఉండాలి.

దానికోసం ప్రాంతీయ, దేశ అవసరాలకు తగ్గట్టుగా పీజీ సీట్ల సంఖ్యలో మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించుకోవాలి. దేశంలో వైద్యవిద్య ఎదుర్కొంటున్న ఇంకో సవాలు, నాణ్యత! వైద్య విద్య బోధనాంశాలను సమీక్షించి, మార్పులు చేయాల్సిన అవసరముంది. ఈ మార్పుల్లో ప్రాక్టికల్‌ అంశాలపై శ్రద్ధ పెట్టడం ఒకటి.

ఇటీవల వార్తా పత్రికల్లో ప్రచురితమైన రెండు వార్తలు పరస్పర విరుద్ధంగా కనిపించాయి. ఒకటేమో ప్రభుత్వం యాభై కొత్త వైద్య కళాశాలలకు అనుమతిచ్చిందన్నది. ఈ రెండు కాలేజీల చేరికతో దేశంలోని మొత్తం ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 1,07,000కు చేరుకుంటుంది. రెండో వార్త ఏమిటంటే, దేశం మొత్తమ్మీద కనీసం 38 వైద్యకళాశాలు తమ గుర్తింపును కొన సాగించేందుకు అవసరమైన ప్రమాణాలను పాటించడం లేదన్నది! ఇంకో వంద కాలేజీలూ ఇదే స్థితిలో ఉన్నట్లు ఈ వార్త చెబుతోంది.

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌  మార్గదర్శకాలను ఇవి పాటించడం లేదన్నది ఆరోపణ. సిబ్బంది బయోమెట్రిక్‌ పద్ధతుల్లో అటెండెన్‌ ్స ఇవ్వాలన్న అంశంతోపాటు మరికొన్ని ఉల్లంఘనల కారణంగా వీటి గుర్తింపు రద్దయ్యే పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. బహుశా ఈ సమస్య కళాశాలల్లో తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల ఉత్పన్నమై ఉండ వచ్చు. లేదా, సిబ్బంది ఒక చోట కాకుండా, మరిన్ని కళాశాలల్లో బోధనకు అంగీకరించి ఉండటమూ కావచ్చు.

దేశంలో ప్రస్తుతం ఉన్న వైద్యులు ఎంతమంది? 2002 జూన్‌  నెలలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి పార్లమెంటుకు ఇచ్చిన సమాధానం ప్రకారం 13,08,009 మంది అల్లోపతి వైద్యులు ఉన్నారు. వీరిలో పదవీ విరమణ చేసినవారు, మరణించిన వారు లేదా ఇతర దేశాలకు వలస వెళ్లినవారు ఉజ్జాయింపుగా 20 శాతం మంది ఉన్నారని అనుకున్నా ప్రస్తుతం పది లక్షలకుపైగా వైద్యులు అందుబాటులో ఉన్నట్లు తేలుతుంది.

ఆయుష్‌ వైద్యులు 5.75 లక్షల మందిని కూడా చేర్చితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉన్నట్లు అవుతుంది. 

2014లో దేశంలోని మొత్తం వైద్య కళాశాలలు 387 కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 695కి చేరింది. మరో 75 జిల్లా ఆసుపత్రులను వైద్యకళాశాలలుగా మార్చేందుకు ఇటీవలే ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిల్లో కొన్నింటిని ఇప్పటికే మార్చేశారు కూడా. జిల్లా ఆసుపత్రి కానీ, ఈఎస్‌ఐ ఆసుపత్రి కానీ రాత్రికి రాత్రి వైద్య కళా శాలగా మారిపోదు. ఇందుకు శిక్షణ పొందిన సిబ్బంది, మౌలిక సదుపాయాల కూర్పు వంటి అనేక మార్పులు, చేర్పులు అవసర మవుతాయి. 

దేశంలో ఇప్పటిమాదిరిగానే రాన్నున ఐదు, ఏడేళ్లలో ఏటా ఒక లక్ష  మంది కొత్త ఎంబీబీఎస్‌ వైద్యులు అందుబాటులోకి వస్తారని అనుకుందాం. అప్పటికి దేశ జనాభా సుమారు 150 కోట్లకు చేరుకుంటుంది. వైద్యుల సంఖ్య కూడా 15 లక్షల వరకూ ఉంటుంది. కాబట్టి ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉంటాడు. ఈ దశలోనే పరిస్థితులు ఆసక్తికరంగా మారతాయి. ఏటా ఎంతమంది వైద్యులు అవసరం? వారందరితో సమర్థంగా పనిచేయించుకోగల పరిస్థితులు ఉన్నాయా?

ప్రస్తుతం ఒక ఎంబీబీఎస్‌ విద్యార్థికి ప్రాక్టికల్‌ అంశాలపై అవ గాహన నాస్తి. ఎందుకంటే పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌  కోర్సులో చేరడమెలా అన్నదానిపైనే విద్యార్థి దృష్టి కేంద్రీకృతమై ఉంటోంది. కానీ ఎంబీబీఎస్‌ సీట్లతో పోలిస్తే పీజీ సీట్లు మూడొంతుల వరకూ తక్కువ. అయినా ఎంబీబీఎస్‌ చదివిన వారిలో అత్యధికులు పీజీ కోసం పోటీపడుతూంటారు. పడాలి కూడా. సహజ సామర్థ్యం, అభిరుచు లకు అనుగుణంగా పీజీ కోర్సులను ఎంచుకునే సౌలభ్యమూ వారికి ఉండాలి.

ప్రాంతీయ, దేశ అవసరాలకు తగ్గట్టుగా పీజీ సీట్ల సంఖ్యలో మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు కల్పించుకోవాలి. ఉదాహరణకు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లకు ఫ్యామిలీ మెడిసిన్‌ లో పీజీ చేసిన వారిని ఎంపిక చేయవచ్చు. బోధన, పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్నవారిని వైద్య కళాశాలలకు ఉపాధ్యాయులుగా శిక్షణ అందించాలి. 

ఆరోగ్య రంగంలో నగర, గ్రామీణ ప్రాంతాల మధ్య తీవ్ర అంతరం ఉంటోంది. మూడింట రెండొంతుల జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నా, అక్కడ పనిచేస్తున్న వైద్యులు మొత్తం వైద్యుల్లో 30 శాతాన్ని  కూడా చేరడం లేదు. గ్రామీణ ఆరోగ్య రంగ గణాంకాల ప్రకారం 2021– 22లో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో వైద్యులు, సిబ్బంది కొరత యాభై శాతం కంటే ఎక్కువే! అంతేకాదు... రాష్ట్రాల వారీగా చూసినా ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది పంపిణీలో తేడా ఉంది.

కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, ఢిల్లీలతో పోల్చితే... జార్ఖండ్, యూపీ, బిహార్‌ రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఇంకో ఆసక్తికరమైన అంశం... కర్ణాటకలోని మొత్తం వైద్యుల్లో 40 శాతం రాజధాని బెంగళూరులోనే ఉండటం! ఫలితంగా అనేక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం ఇప్పటికీ దూరంగానే ఉంటోంది.

కేంద్ర ప్రభుత్వం ఎంబీబీఎస్‌ సీట్లను పెంచాలన్న విధాన నిర్ణయం తీసుకోవటం అసలు లక్ష్యమేమిటి? నగరాల్లో తగినంత మంది వైద్యులు అందుబాటులోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంత అవసరాలను తీర్చడమా? మౌలిక సదుపాయాలు లేకపోవడం అనే కారణంతో చాలామంది వైద్యులు పల్లె ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడరు. పల్లెల్లో పనిచేస్తే పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి లేదన్న భావన కూడా కొంతమంది వైద్యుల్లో, మరీ ముఖ్యంగా ప్రైవేట్‌ కాలేజీల్లో చదివిన వారిలో ఉంటుంది. 

దేశంలో వైద్యవిద్య ఎదుర్కొంటున్న ఇంకో సవాలు, నాణ్యత! వైద్య విద్య బోధనాంశాలను అప్పుడప్పుడు సమీక్షించి, మార్పులు చేయాల్సిన అవసరముంది. ఈ మార్పుల్లో ప్రాక్టికల్‌ అంశాలపై శ్రద్ధ పెట్టడం ఒకటి. కొత్త కాలేజీలు ఏర్పాటవుతున్నంత వేగంగా మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదు. చాలా రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల్లో సూపర్‌ స్పెషలిస్టుల పోస్టులకు దరఖాస్తులే రాకపోవడం దీనికి ఒక ఉదాహరణ! తగిన మౌలిక సదుపాయాలు, పరికరాలు, పనిచేసుకునేందుకు తగినంత స్వేచ్ఛ ఉన్న ఆలిండియా ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో మాత్రం ఈ పరిస్థితి లేదు. 

ఎంబీబీఎస్‌లోకి ప్రవేశాలను నియంత్రించేందుకు ‘నీట్‌’ ద్వారా గట్టి ప్రయత్నమే జరిగింది. అయితే సగం కాలేజీలు ప్రైవేట్‌వి కావడం, అక్కడి విద్యార్థుల ర్యాంకులు అతి తక్కువగా ఉండటం వల్ల దేశంలోని విద్యా ప్రమాణాల్లో సమానత లేదని తెలుస్తుంది! టెలి మెడిసిన్‌  టెక్నాలజీ ద్వారా దేశం మొత్తమ్మీద ఒకే రకమైన వైద్య విద్యను ఎందుకు అందించలేకపోతున్నామన్నది ప్రశ్న!

ఏతావతా... దేశంలో వైద్యవిద్యను సమూలంగా మార్చాల్సిన అవసరముంది. 1910లో ఫ్లెక్స్‌నర్‌ నివేదిక తరువాత అమెరికాలో జరిగిన మార్పుల మాదిరిగా అన్నమాట. అప్పట్లో బోధనాంశాలు మొత్తాన్ని రివైజ్‌ చేశారు. కాలేజీల సంఖ్యను 155 నుంచి తగ్గించారు. ప్రతి అంశానికి సంబంధించిన కనీస ప్రమాణాలు, శిక్షణ, అవధులను నిర్ణయించారు. తరువాతి కాలంలో కెనడా, యూరప్‌లలోనూ ఇదే పద్ధతిని అనుసరించడం గమనార్హం. 

భారత్‌లో వైద్య కళాశాలల సంఖ్యను హేతుబద్ధీకరించాల్సిన అవసరముంది. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఎంబీబీఎస్‌ వైద్యులు, స్పెషలిస్టులు, సూపర్‌ స్పెషలిస్టులను సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు 2025లో మనకు చిన్న పిల్లల వైద్యులు, కంటి వైద్యుల అవసరం ఎక్కువ అనుకుందాం. అదే సమయంలో ఐదేళ్ల తరువాత న్యూరోసర్జన్లు, ఫిజీషియన్ల అవసరం ఉందని అనుకుంటే... అందుకు తగ్గట్టుగా పీజీ కోర్సులు, సీట్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు చేసుకోవాలి.
రాకేశ్‌ కోచర్‌ 
వ్యాసకర్త ఇండియన్‌  సొసైటీ ఆఫ్‌ గ్యాస్ట్రో
ఎంటరాలజీ మాజీ అధ్యక్షులు(‘ద ట్రిబ్యూన్‌’ సౌజ్యంతో)

Advertisement
Advertisement