రీల్ లైఫ్లోనే గాదు రియల్ లైఫ్లో కూడా బ్యూటీఫుల్ కపుల్ ఎవరంటే ఠక్కున చెప్పేస్తారు సూర్య-జ్యోతికలని. ఈ ఇద్దరు నటనపరంగానే కాదు, వ్యక్తితత్వ పరంగానూ నూటికి నూరు మార్కులు దక్కించుకున్న గొప్ప జంటగా పేరు తెచ్చుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె దియా, కుమారుడు దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. హీరో సూర్యతో పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చిన జ్యోతిక కొంతకాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి..అశేష ఆదరాభిమానాలను అందుకుంది. అయితే ఆమె ఒక పక్క తన వృత్తిని, మాతృత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూ..సూపర్ విమెన్గా పేరుతెచ్చుకుంది కూడా. మరి అలాంటి జ్యోతిక పిల్లల పెంపకం విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటుంది?, ఆమె చెప్పే అమూల్యమైన పేరెంటింగ్ టిప్స్ గురించి సవివరంగా తెలుసుకుందామా.!.
ఒక ఇంటర్వూలో జ్యోతిక తాను తల్లిగా మారాక తనకు జీవితం పట్ల ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోయిందన్నారు. ముఖ్యంగా తన పిల్లలను మీడియాకి, సెలబ్రిటీ హోదాకి చాలా దూరంగా ఉంచుతానని చెబుతున్నారు. వాళ్లకు సహనం, భావోద్వేగాల విలువ గురించి నేర్పిస్తుంటానని చెప్పారు. పేరెంట్స్గా పిల్లలను విలువలతో పెంచడం తోపాటు తాము కూడా కొన్ని విషయాలను వారి నుంచి నేర్చుకున్నామని అన్నారు.
జీవితంలో కొన్ని సమయాల్లో వేగాన్ని తగ్గించి చిన్ని చిన్ని విషయాలను కూడా ఆస్వాదించడం, వాటి విలువ గురించి తెలుసుకోవడంలో పిల్లలు ఎంతగానో సహాయపడ్డారని అంటోంది. బాధ్యత, నిస్వార్థ ప్రేమ విలువలను తన పిల్లల ద్వారా తెలుసుకోగలిగానని చెబుతోంది. పిల్లలు ఎదుగుతుండటాన్ని చూడటం జీవితంలో అత్యంత సంతృప్తికరమైన క్షణాల్లో ఒకటని అన్నారు. అలాగే పిల్లల పెంపకంలో అత్యంత ముఖ్యమైనది వారి వ్యక్తిత్వాన్ని ప్రోత్సాహించడం అని ప్రగాఢంగా విశ్వసిస్తానని చెప్పారు.
పిల్లలు నిజంగా దేనిపట్ల మక్కువ కలిగి ఉన్నారో తెలుసుకుంటూ..ఆ విషయాలను అన్వేషించి, ఆ దిశలో వెళ్లేలా స్వేచ్ఛను ఇవ్వడానికే ప్రయత్నిస్తానని అన్నారామె. దీనివల్ల పిల్లలు ఇతరుల ఆదేశాలకు లేదా నిర్ణయాలకు లోబడకుండా, తమను తాము వ్యక్తీకరించుకోగలిగేలా ధైర్యం ఆత్మవిశ్వాసంతో ముందుగకు సాగుతారని అంటోందామె. అంతేగాదు పిల్లలందరూ తమదైన రీతిలో ప్రత్యేకమైనవారని, విశిష్టమైన వాళ్లని నమ్ముతానని అన్నారు. అంతేగాదు సినీ ఆడంబరాలకు అతీతంగా వాస్తవాలను తెలసుకునేలా పెంచుతానని, ముఖ్యంగా ఒదిగి ఉండేలా పెంచుతానని అన్నారు. అలాగే ఆమె ప్రతి తల్లిదండ్రలు త పిల్లలతో కలిసి ఈ మూడు పనులు చేయాలని అన్నారు. అవేంటంటే..
ప్రతిరోజూ పిల్లలతో కనీసం ఒక గంట నాణ్యమైన సమయం గడపడం ముఖ్యం. కలిసి భోజనం చేయండి, ఎటువంటి అంతరాయం లేకుండా మాట్లాడండి, బహుశా ఒక గేమ్ లేకా వాళ్లకు నచ్చిదాంతో మమేకమైతే.. పిల్లలు తమ మనసు విప్పి, వారు ఏమి ఆలోచిస్తున్నారో, వారిలో నిజంగా ఏమి జరుగుతుందో మనకు చెప్పడానికి సహాయపడుతుంది. వారి ప్రాణ స్నేహితుడు ఎవరు, వారికి ఎవరు ఇష్టం, ఒక పిల్లవాడిని ఎందుకు ఇష్టపడరు, ఏ ఉపాధ్యాయుడితో ఏమి జరుగుతోంది వంటి సాధారణ విషయాలు సైతం మనతో పంచుకుంటారు.
రెండొవది ప్రయాణం చేయడం. కలిసి ప్రయాణం చేసినప్పుడు కుటుంబ బంధం చాలా బలపడుతుంది.
మూడవది వారికి ఆదర్శంగా ఉండటం; వారికి సలహాలు ఇవ్వకండి.
చివరగా ప్రతి తల్లి తన వృత్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోగల సామర్థ్యం ఆమెకు ఉంటుందని చెబుతోంది జ్యోతిక. తన మటుకు ఎంత బిజీగా ఉన్నా..కుటుంబానికి ప్రాధ్యాన్యత ఇస్తానని, రెండిటిని సమతుల్యం చేసుకునే పనులను బ్యాలెన్స్ చేస్తానని అన్నారామె.
(చదవండి: నీతా అంబానీకి మానవతా పురస్కారం..!)


