చలికాలం గాఢనిద్ర వీడి, వసంతంలోకి నెమ్మదిగా అడుగుపెడుతున్న వేళ.. జపాన్ వీథులన్నీ గులాబి రంగుతో మెరిసిపోతూ అందాల పందిళ్ళలా కనువిందు చేస్తాయి. ఇప్పటి వరకు మంచు ముసుగులో నిశ్శబ్దంగా ఉన్న కొమ్మలన్నీ చెర్రీ పూల విరబూతతో కళకళలాడుతాయి. నింగి నుంచి గులాబి మబ్బులు నేలకు దిగివచ్చాయా అన్నట్లుగా ఈ పూలు సందర్శకులను ఒక మాయలోకంలోకి తీసుకువెళతాయి. గాలికి రాలిపడే పూల రేకులు దారి పొడవునా మెత్తని తివాచీలా మారి నడిచే ప్రతి అడుగును మధుర స్వప్నంలా మారుస్తాయి. చెర్రీ బ్లోసమ్ ప్రకృతి పలకరింపు మాత్రమే కాదు. తరతరాల సంప్రదాయాన్ని, నేటి ఆధునిక జీవన వేగాన్ని ఏకం చేసే భావోద్వేగాల వేడుక.
ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ చెర్రీ బ్లోసమ్ పండుగ జరుగుతుంది. ఈ కాలంలో గులాబి రంగు చెర్రీపూలను చూస్తూ జపనీయులు ఆనందిస్తారు. దీన్ని ‘హనామి’ అని పిలుస్తారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ, జపనీయులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆరుబయట చెర్రీ చెట్ల నీడలో వనభోజనాలు చేస్తారు. ఆటపాటలతో సరదాగా గడుపుతారు. ఈ ఏడాది మార్చి 21 నుంచి పూలు వికసిస్తాయని స్థానిక వాతావరణ శాఖ అంచనా వేసింది. పగటి పూట కనువిందు చేసే లేత గులాబీ వర్ణపు సొగసులు, రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగుల్లో మరింత శోభాయమానంగా కనిపిస్తాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ‘యోజాకురా’ అంటారు.
ఈ పూల సందడితో టోక్యోలోని యునో పార్క్, క్యోటోలోని ఫిలాసఫర్స్ పాత్, ఒసాకా కోట పరిసరాలు గులాబీ రంగులో కళకళలాడతాయి. చెర్రీ పూలు వికసించిన వారం పది రోజుల్లోనే రాలిపోతాయి. వికసించిన కొద్దిరోజుల్లోనే రాలిపోయే ఈ పూలు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతాయి. జీవితం చిన్నది. ఉన్నంతలో పరిమళించాలి, ప్రతి క్షణాన్నీ ప్రేమగా ఆస్వాదించాలి అనే జీవన సందేశాన్ని అందిస్తాయి.
ప్రకృతి ప్రేమికులకు, ఫొటోగ్రాఫర్లకు ఈ సీజన్ ఒక మధుర జ్ఞాపకంగా నిలుస్తుంది. ఈ పండుగ సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది పర్యాటకులతో జపాన్ లోని ఊరూరా వీథులు కళకళలాడతాయి. ఈ సమయంలో సంప్రదాయ వాయిద్యాలైన కోటో, వెదురు వేణువులతో కళాకారులు సంగీత ప్రదర్శనలిస్తారు. గాలికి ఊగిసలాడే పూల మధ్యలో వేణుగానం పర్యాటకులను పరవశింపజేస్తుంది. స్థానిక కళాకారుల చేతి వృత్తుల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. పండగ సమయంలో చెర్రీ పూల పరిమళంతో తయారు చేసే మొచి, టీ, స్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
సంహిత నిమ్మన


