తల్లికి జరిగిన అన్యాయమే ఐఏఎస్‌ అధికారిగా మార్చింది..ఆనంద్‌ మహీంద్రా మెచ్చిన స్టోరీ.. | Anand Mahindra Is Inspired By A Labourers Son Who Became IAS Officer | Sakshi
Sakshi News home page

తల్లికి జరిగిన అన్యాయమే ఐఏఎస్‌ అధికారిగా మార్చింది..ఆనంద్‌ మహీంద్రా మెచ్చిన స్టోరీ..

Mar 14 2025 2:37 PM | Updated on Mar 14 2025 11:58 PM

Anand Mahindra Is Inspired By A Labourers Son Who Became IAS Officer

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను సోషల్‌ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యువతను ప్రేరేపించే మంచి స్ఫూర్తిదాయక స్టోరీలు షేర్‌ చేసుకుంటుంటారు. అలానే ఈసారి ఆయన మనసుకు బాగా హత్తుకున్న స్పూర్తిదాయకమైన మరొక గాథను పంచుకున్నారు. తల్లికి జరిగిన అన్యాయమే కొడుకుని ప్రతిష్టాత్మక యూపీఎస్సీ ఎగ్జామ్‌ని చేధించేందుకు దారితీసింది. ప్రపంచముందు ఓ హీరోలో నిలిచేందుకు కారణమైంది. విమర్శలతో సాగిన జీవితం బాధతో ఆగిపోకూడదనే చెప్పే ఈ స్టోరీ అందరి మనసులను కదిలిస్తుందంటూ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఆ సక్సస్‌ స్టోరీ ఎవరిదంటే...

రాజస్థాన్‌కి చెందిన హేమంత్‌ స్టోరీనే ఇది. అతడి తల్లి దినసరి కూలీ. అయితే సాధారణంగా కూలీకి ఇచ్చే రూ. 200 వేతనం కంటే తక్కువే ఆమె పొందడంతో బాధపడి ఇదేంటని కాంట్రాక్టర్లని నిలదీశాడు హేమంత్‌. వాళ్లంతా ఎగతాళి చేస్తూ.చాలా అవమానకరంగా మాట్లాడారు. అదే హేమంత్‌లో కసిని పెంచి ఐఏఎస్‌ అవ్వాలనే ఆకాంక్షను రగిల్చింది. 

అందుకు అతడి వద్ద కనీస వనరులేవి లేవు. ఇంట్లో ఆదాయం అంతంతమాత్రమే. తన లక్ష్యం ఇది అని చెబితే..అంతా సాధ్యం కాదని నిరాశపరిచినవాళ్లే. పైగా కాస్త డబ్బున్న వాళ్లు కోచింగ్‌లు తీసుకుని సాధించగలరని నిరుత్సాహాపరిచడమే అడగడుగునా..అయినా అవేం పట్టించుకోలేదు. కేవలం జేబులో రూ. 1400లతో ఢిల్లీ వెళ్లిపోయాడు. అక్కడ ఎక్కడ చదువుకోవాలో తెలియదు. మార్గదర్శకత్వం చేసేవాళ్లు లేరు. 

కేవలం ఎలాగైన ఐఏఎస్‌ అధికారి కావాలన్న తపన మాత్రమే ఉంది. అదే అతడిని తనలాంటి వాళ్లకు ఆశ్రయం ఇచ్చే చోటుకి చేర్చింది. అలా LBSNAA (లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్)లో శిక్షణ తీసుకుని మరీ ఆల్‌ఇండియా ర్యాంక్‌ 884 సాధించాడు. దివ్యాంగుల కోటలో సాధించాల్సిన ర్యాంకుని అందుకుని ఐఏఎస్‌ అయ్యాడు. ఇక్కడ హేమంత్‌కి శారీరకంగా, ధనం పరంగా అసమానతలు ఉన్నాయి. 

నిజానికి సాధించగలిగేంత చిన్న లక్ష్యం కాదు ఐఏఎస్‌ అంటే. ఆ విషయం హేమంత్‌కి కూడా తెలుసు. అయితే హేమంత్‌ ఎదుర్కొన్న విమర్శలు అతడిని లక్ష్యం సాధించేలా కసి పెంచాయి. అందువల్లే అతడు తన లక్ష్యం అనితరసాధ్యమైనదని ఎందరన్నా..తన గమ్యం వైపే అడుగులు వేశాడు. ప్రతికూలతలు, అవమానాలకు ప్రతిస్పందన మనం సాధించే విజయమే అని చాటి చెప్పాడు. 

అంతేగాదు మనం అందుకున్న ఘన విజయం విమర్శకుల నోటికి తాళం పడేలా చేస్తుందని చేతల్లో చేసి చూపించాడు హేమంత్‌. ప్రతిఒక్కరూ తమ కెరీర్‌లో ఎక్కడో ఒక చోట ఇలాంటి అవమానాలు, చులకనభావం వంటివి ఎదుర్కొనే ఉంటారు. వాటికి ప్రతిస్పందించి శక్తిని వృద్ధా చేసుకునే కంటే..మన అభ్యున్నతిపై దృష్టిపెట్టి ఊహించని విజయం అందుకుంటే అదే వారికి గొడ్డలిపెట్టు అని పోస్ట్‌లో హైలెట్‌ చేసి చెప్పారు ఆనంద్‌ మహీంద్రా. నెటిజన్లు కూడా ప్రతికూలతలకు మన విజయంతోనే గట్టి సమాధానం చెప్పాలంటూ ఆయనకు మద్దతుగా పోస్టులు పెట్టారు.



--

(చదవండి: ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే..! హెచ్చరిస్తున్న న్యూట్రిషన్లు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement