చైన్‌ స్నాచింగ్‌ కేసుల్లో ఇద్దరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చైన్‌ స్నాచింగ్‌ కేసుల్లో ఇద్దరి అరెస్ట్‌

Apr 1 2026 7:30 AM | Updated on Apr 1 2026 7:30 AM

చైన్‌ స్నాచింగ్‌ కేసుల్లో ఇద్దరి అరెస్ట్‌

128 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం

ఏలూరు టౌన్‌: చైన్‌ స్నాచింగ్‌ కేసుల్లో ఇద్దరు నేరస్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి భారీగా బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ కేసు వివరాలను వెల్లడించారు.

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమంట్ర గ్రామానికి చెందిన బండి గోపాలకృష్ణ, ప్రస్తుతం పెనుమంట్రలో నివాసం ఉంటున్న యలమంచిలి మండలం మేడపాడుకు చెందిన కుక్కల హరిప్రకాష్‌ జల్సాలు, విలాసాలకు అలవాటుపడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించే క్రమంలో వారిద్దరూ దొంగతనాలు చేయటం ప్రారంభించారు. అనంతరం షాపుల వద్ద, ఒంటరిగా వెళ్లే మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలు లాక్కుని పారిపోతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో వీరిద్దరిపై చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల చోరీ చేసిన బంగారు వస్తువులు విక్రయించేందుకు ఇద్దరూ రెండు మోటారు సైకిళ్లపై హైదరాబాద్‌ వెళుతుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఉంగుటూరు మండలం సీతారామపురం గ్రామ శివారు, గణపవరం నుంచి నారాయణపురం వైపు వెళ్లే రోడ్డులో నిడమర్రు సీఐ ఎన్‌.రజనీకుమార్‌ ఆధ్వర్యంలో చేట్రోలు ఎస్సై ఎం.సూర్యభగవాన్‌ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్‌ పర్యవేక్షణలో విచారణ చేయగా చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించి, వారి నుంచి సుమారు రూ.12.80లక్షల విలువైన 128 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్లను చేబ్రోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసాపురం టౌన్‌, యలమంచిలి, రాజోలు, చేబ్రోలు, పాలకొల్లు రూరల్‌ తదితర ప్రాంతాల్లో చోరీ చేసిన బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

మరో కేసులో నేరస్తుడి అరెస్ట్‌

నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామంలో ముత్యాల వీరవెంకట సత్యనారాయణ అనే వ్యక్తి ఇంటిలో మార్చి 19న చోరీ జరిగింది. ఈ కేసును నిడమర్రు సీఐ రజనీకుమార్‌, ఎస్సై ఎస్‌ఎన్‌వీవీ రమేష్‌ విచారణ చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గణపవరం అల్లూరివారి వీధికి చెందిన కాకర్ల నాగదుర్గారావు నిందితుడిగా నిర్ధారించి అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి 26.2 గ్రాముల బంగారు ఆభరణాలు, 808 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో ప్రతిభ చూపిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement