ఇక జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు కూడా ఏడాది పొడవునా పందేల నిర్వహణ పాకింది. ప్రధానంగా జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ద్వారకాతిరుమల, నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో పెద్ద ఎత్తున పందాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురంలోని ఓ పామాయిల్ తోటలో ఉదయాన్నే సుమారు 200 మందితో కోడిపందేల నిర్వహణ ప్రారంభించారు. పండగ హడావుడి కావడంతో ఎవరూ పట్టించుకోరని కోడిపందేలకు తెరతీయగా స్థానికులు సోషల్ మీడియాలో పందేల వీడియో పోస్టు చేయడం పోలీసులు వస్తున్నారనే సమాచారంతో పందెంరాయుళ్లు పరారయ్యారు. చింతలపూడి మండలంలోని శివాపురం, చింతలపూడి, తీగలవంచ, కొమ్ముగూడెం ప్రాంతాల్లో శుక్రవారం పోలీసులు దాడి చేయగా 32 మంది పందెంరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.30,180 నగదు, 20 ద్విచక్రవాహనాలు, 14 కోళ్ళు స్వాధీనం చేసుకున్నారు. నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో కోడిపందేల నిర్వహణపై పోలీసులు సమాచారం అందుకుని 3 కోళ్లు, 2 కత్తులు, రూ.6480 నగదు, 9 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


