దెందులూరు: పేరుకే జెడ్పీటీసీసలమని.. గౌరవం వేతనం లేదని పలువురు జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం నుంచి ఒకరు జెడ్పీటీసీగా ఎన్నికవుతారు. జిల్లాలో 48 మంది జెడ్పీటీసీలున్నారు. ఒక్కొక్కరికి నెలకు గౌరవ వేతనంగా రూ.6000 ప్రభుత్వం కేటాయించింది. 36 నెలలుగా ఒక్కొక్కరికి సుమారు 2.18 లక్షలు రావాల్సి ఉంది. మొత్తం 48 మంది జడ్పీటీసీ సభ్యులకు కలిపి రూ. 1.03 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఆరు నెలలు మాత్రమే గౌరవ వేతనం మంజూరు చేశారంటున్నారు. జిల్లా పరిషత్ అధికారులు జెడ్పీటీసీ గౌరవ వేతనం బిల్లులు మంజూరుకు రెండు మూడుసార్లు ప్రభుత్వానికి పంపారని, బిల్లులకు సంబంధించి నిధులు మంజూరు కాలేదు. ఇదేనా జెడ్పీటీసీ సభ్యులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవమని అని ప్రశ్నిస్తున్నారు.
2026 సెప్టెంబర్ 30 వరకు జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ఉందని, ఇంకెప్పుడు ప్రభుత్వం గౌరవం వేతనం మంజూరు చేస్తుందని జెడ్పీటీసీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో సంవత్సరానికి జిల్లాకు వివిధ పనుల నిమిత్తం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్న ప్రభుత్వం ప్రజల నుంచి ఎన్నికై న జెడ్పీటీసీ సభ్యులకు గౌరవం వేతనం ఎందుకు పెండింగ్లో పెడుతున్నారని అడుగుతున్నారు. బయటి వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా ఇబ్బందిగా ఉందని పలువురు జెడ్పీటీసీలు వాపోతున్నారు. జిల్లా పరిషత్ అధికారులు ఒకటికి రెండుసార్లు బిల్లులు పెట్టినా ఎందుకు మంజూరు చేయడం లేదని, పెండింగ్ ఎందుకు పెడుతున్నారని అంటున్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. తమకు అందించే గౌరవ వేతన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సరైనది కాదని జెడ్పీటీసీలు అంటున్నారు
మంజూరుకు నోచుకోని బిల్లులు


