పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని వెలమగూడెం ప్రాంతానికి చెందిన దాసరి సురేష్ రాజు (52) హైదరాబాద్లోని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాలకొల్లుకు చెందిన సురేష్ రాజు ఏడేళ్ల క్రితం కుటుంబ సమేతంగా హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ సమత నగర్, బోయినపల్లిలో నివాసం ఉంటూ రైస్ బిజినెస్ చేసుకుంటున్నారు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం వ్యాపార పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై కూకట్పల్లి వెళ్లారు. అక్కడ టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో సురేష్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పంచనామా అనంతరం అతడి మృతదేహాన్ని పాలకొల్లుకు తీసుకురానున్నారు.
వీరవాసరం: వీరవాసరం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం పోక్సో కేసు నమోదైందని ఎస్సై ఎం.రాజకుమార్ తెలిపారు. మైనర్ బాలికపై, మైనర్ బాలుడు అత్యాచారం చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనా ప్రాంతాన్ని డీఎస్పీ రఘువీర్ విష్ణు, భీమవరం రూరల్ ఎస్సై శ్రీనివాసరావు సందర్శించి వివరాలు సేకరించినట్లు చెప్పారు.


