సంతృప్తి, అసంతృప్తి ఇలా..
ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి రెండో ర్యాంకు లభించింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా? దేవాలయాల్లో తాగునీటి వసతులు బాగున్నయా? ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా? పారిశుధ్యం సంతృప్తికరంగా ఉందా? అనే ఈ నాలుగు అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో ఏదొక అంశంలో ద్వారకాతిరుమల దేవస్థానానికి ప్రతి నెలా మొదటి ర్యాంకు లభించేది. కానీ ఈ సారి ఏ అంశంలోనూ మొదటి ర్యాంకు రాలేదు. ఓవరాల్గా మాత్రం రెండో ర్యాంక్ దక్కింది. గతనెల 22 నుంచి, ఈనెల 21 వరకు జరిపిన సర్వేలో అన్నవరం 73.7 శాతంతో మొదటి ర్యాంక్ సాధించగా, ద్వారకాతిరుమల 73.6 శాతంతో రెండో ర్యాంక్, సింహాచలం 73.5 శాతంతో మూడవ ర్యాంక్, శ్రీకాళహస్తి 73 శాతంతో నాల్గవ స్థానం, విజయవాడ 71.5 శాతంతో ఐదవ స్థానం, కాణిపాకం 71 శాతంతో ఆరవ ర్యాంక్, శ్రీశైలం 65.9 శాతంతో ఏడవ ర్యాంక్ను సాధించాయి.
అంశాల వారీగా ర్యాంకుల వివరాలు
● సంతృప్తికర దర్శనం అంశంలో: మొదటి ర్యాంక్ సింహాచలంకు, రెండవ ర్యాంక్ అన్నవరంనకు, మూడో ర్యాంక్ ద్వారకాతిరుమలకు, నాల్గో ర్యాంక్ విజయవాడకు, ఐదో ర్యాంక్ శ్రీకాళహస్తికి, ఆరో ర్యాంక్ కాణిపాకంకు, ఆఖరి ర్యాంక్ శ్రీశైలంకు దక్కాయి.
● తాగునీటి సదుపాయం అంశంలో : మొదటి ర్యాంక్ సింహాచలంకు, రెండో ర్యాంక్ అన్నవరంనకు, మూడో ర్యాంక్ ద్వారకాతిరుమలకు, నాల్గో ర్యాంక్ కాణిపాకంకు, ఐదో ర్యాంక్ శ్రీకాళహస్తికి, ఆరో ర్యాంక్ విజయవాడకు, ఆఖరి ర్యాంక్ శ్రీశైలంకు దక్కాయి.
● ప్రసాదం తాజా, రుచి అంశంలో: మొదటి ర్యాంక్ అన్నవరంనకు, రెండో ర్యాంక్ సింహాచలంకు, మూడో ర్యాంక్ ద్వారకాతిరుమలకు, నాల్గో ర్యాంక్ శ్రీకాళహస్తికి, ఐదో ర్యాంక్ విజయవాడకు, ఆరో ర్యాంక్ కాణిపాకంకు, ఆఖరి ర్యాంక్ శ్రీశైలంకు దక్కాయి.
● పారిశుధ్య నిర్వహణ అంశంలో : మొదటి ర్యాంక్ శ్రీకాళహస్తికి, రెండో ర్యాంక్ ద్వారకాతిరుమలకు, మూడో ర్యాంక్ అన్నవరంనకు, నాల్గో ర్యాంక్ కాణిపాకంకు, ఐదో ర్యాంక్ విజయవాడకు, ఆరో ర్యాంక్ సింహాచలంకు, ఆఖరి ర్యాంక్ శ్రీశైలంకు దక్కాయి.
ఈసారే వెనుకంజ..
● గతేడాది నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు నిర్వహించిన సర్వేలో శ్రీవారి ప్రసాదాలకు మొదటి ర్యాంక్ లభించింది.
● గతేడాది డిసెంబర్ 26 నుంచి ఈ ఏడాది జనవరి 25 వరకు నిర్వహించిన సర్వేలో పారిశుధ్యానికి మొదటి ర్యాంక్ లభించింది.
● జనవరి 26 నుంచి ఫిబ్రవరి 22 వరకు జరిగిన సర్వేలో దర్శనానికి మొదటి ర్యాంక్ లభించింది.
● ఫిబ్రవరి 22 నుంచి మార్చి 21 వరకూ నిర్వహించిన సర్వేలో ఏ అంశంలోనూ శ్రీవారి దేవస్థానానికి మొదటి ర్యాంక్ రాలేదు.
ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో చినవెంకన్న దర్శనం సంతృప్తికరంగా జరిగిందని 75.9 శాతం మంది, జరగలేదని 24.1 శాతం మంది తెలిపారు. అలాగే తాగునీరు సదుపాయం బాగుందని 71.5 శాతం మంది, బాగోలేదని 28.5 శాతం మంది తెలిపారు. ప్రసాదం తాజాగా, రుచిగా బాగుందని 79 శాతం మంది, బాగోలేదని 21 శాతం మంది తెలిపారు. పారిశుధ్యం బాగుందని 67.8 శాతం మంది, బాగోలేదని 32.2 శాతం మంది తెలిపారు.
భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్న దేవస్థానాల్లో.. శ్రీవారి దేవస్థానానికి రెండో ర్యాంక్
ప్రభుత్వం నిర్వహించిన వాట్సాప్, ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి
నాలుగు అంశాలపై జరిగిన సర్వే


