ఏలూరు (టూటౌన్): కేంద్రం, రాష్ట్రంలో పాలకులు మహిళల హక్కులను హరించి వేస్తున్నారని విశ్రాంత జడ్జి అడబాల లక్ష్మి పేర్కొన్నారు. గురువారం స్థానిక స్ఫూర్తి భవనంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఒక్కరు వద్దు–ముగ్గురు ముద్దు అనే పథకంపై రౌండ్ టేబుల్ సమావేశం ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నవ యామిని అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ పాలకులు మారినా విధానాలు మారలేదని, వ్యవస్థలను, చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఈ పథకాన్ని మహిళలపై బలవంతంగా రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ఎ.రాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలను పిల్లలు కనే యంత్రాలుగా మారుస్తుందని విమర్శించారు. సీ్త్ర విముక్తి రాష్ట్ర కమిటీ సభ్యులు కె.రమాదేవి సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


