పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు) పట్టణానికి చెందిన విశ్రాంత డిప్యూటీ తహశీల్దార్, రచయిత వీరా పోతన రచించిన భలేటి నమూనా జూస్కో నాటిక ఆరవింద ఆర్ట్స్ సంస్థ ఎంపిక చేసిన 50 ఉత్తమ హాస్య, వ్యంగ్య నాటికల్లో ఒకటి ఎంపికై ంది. 50 నాటికల్లో తాను రచించిన వ్యంగ్య నాటిక ఎంపికవడం అదృష్టంగా భావిస్తున్నానని పోతన తెలిపారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో పుస్తకాన్ని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ చేతుల మీదుగా ఆవిష్కరించారన్నారు. పోతన నాటిక ఎంపిక పట్ల పట్టణంలో కళాకారులు, కళాభిమానులు, అభినందనలు తెలిపారు.
దెందులూరు: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందింది. సానిగూడెం గ్రామానికి చెందిన వేముల తిరుపతమ్మ(19) ఇంటి వద్ద ఎవరూ లేరు సమయంలో సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. గమనించిన బంధువులు ఆమెను ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
భీమవరం: యూత్ హాస్టల్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా(వైహెచ్ఏఐ) భీమవరం యూనిట్ వరుసగా మూడేళ్లుగా రాష్ట్ర స్థాయి అత్యుత్తమ సంఘంగా ఎంపికై ంది. ఈ సందర్బంగా ఆదివారం అరకు సమీపంలో గిరిజన గ్రామదర్శినిలో భీమవరం యూనిట్కు ఉత్తమ యూత్ హాస్టల్ పురస్కారం అందించినట్లు భీమవరం డిస్ట్రిక్ట్ యూనిట్ చైర్మన్ మట్లపూడి సత్యనారాయణ చెప్పారు.
ఉండి: అసలే మండుటెండలు ఆపై మొరాయిస్తున్న ఆర్టీసీ బస్సులు... ఆదివారం ఒకటి, సోమవారం మరొకటి. సోమవారం ఉండి సెంటర్లో భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. చేసేది లేక బస్సులోని ప్రయాణికులు బస్సును నెట్టడంతో కొంతసేపటికి నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అధికారులు బస్సు కండీషన్ను పరిశీలించాలని బస్సులు ఆగిపోతే ప్రయాణికుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
పాలకోడేరు: ఇంటికి తాళాలు వేసి పెళ్లికి వెళ్లి వచ్చేసరికి బంగారం, వెండి అపహరించుకుపోయారు. బాధితుల కథనం ప్రకారం శృంగవృక్షంలోని సాయిబాబా గుడి పక్కన ఉంటున్న కచ్చెట్టి అలివేలు మంగతాయారు, భర్త, కూతురితో కలిసి ఈ నెల 10న బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళారు. మళ్లీ 13న వచ్చేసరికి ఇంటి తాళాలు బద్ధలుకొట్టి, బంగారం, వెండి, నగదు అపహరించుకు పోయినట్లు గుర్తించారు. 7 కాసుల బంగారం వస్తువులు, 40 తులాల వెండి ఆభరణాలు, 17 వేల నగదు అపహరించుకు పోయారని వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎస్సై రవివర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్వారకాతిరుమల: మండలంలోని తిరుమలంపాలెంలోని ఓ ఇంట్లో సోమవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మిడతా లక్ష్మణరావు స్థానికంగా ఉన్న గుడికి వెళ్లాడు. అతని భార్య గేదెలను మేపేందుకు పొలానికి వెళ్లగా.. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో చిలుకూరి కొండయ్య లక్ష్మణరావుకు ఫోన్ చేసి, మీ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పాడు. దీంతో లక్ష్మణరావు ఇంటికి వెళ్లి చూడగా ఇంటి పైకప్పు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించినట్టు గుర్తించారు. బీరువా పగులగొట్టి అందులోని రూ.70 వేల నగదు, 10 తులాల వెండి వస్తువులను చోరీ చేసినట్టు గుర్తించాడు. లక్ష్మణరావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు.


