నరసాపురం: నరసాపురం పాత అంబేశ్వరా థియేటర్ సమీపంలో కనకం సత్యవాణి తన ఇంటికి తాళం వేసి గుమ్మం ఎదుట మూడురోజులుగా కాపలా కాయడం చర్చనీయాంశమైంది. ఒంటరి మహిళలు టార్గెట్గా కొన్ని కబ్జా ముఠాలు తీరప్రాంతంలో ఎలా పేట్రేగిపోతున్నాయో దీంతో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ పోలీసులు, అధికార పార్టీ నేతలను కలిసి తన బాధ వెళ్లబోసుకున్నా.. నీ ఇల్లు కబ్జా అయ్యింది, ఏదోరకంగా సెటిల్ చేసుకో అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. భర్త పోయి ఇద్దరు ఆడపిల్లలతో బతుకుతున్న తన ఇంటిని కాపాడాలని సత్యవాణి వేడుకుంటుంది. సత్యవాణి భర్త చనిపోవడంతో తన ఇల్లు 2023లో బేరం పెట్టింది. లిఖితపూడికి చెందిన యాదంరెడ్డి లక్ష్మి, ఆమె భర్త ఇల్లు కొనుగోలు చేస్తామని రూ.63 లక్షలకు బేరం కుదుర్చుకుని రూ.2 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చినట్టు సత్యవాణి చెప్పారు. నెలరోజుల తరువాత రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామని అప్పటివరకూ ఇంట్లో ఇద్దెకు ఉంటామని దిగి అప్పటి నుంచి ఇంటి ఇద్దె ఇవ్వకుండా, రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా, ఇళ్లు ఖాళీ చేయకుండా ఏడిపిస్తున్నారు.
తన ఇల్లు ఖాళీ చేయంచేందుకు సత్యవాణి అనేక ప్రయత్నాలు చేసింది. ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసులను ఆశ్రయించారు. అయినా ఫలితం లేకపోయింది. పైగా ఎదురు కేసులు పెట్టిస్తున్నారని సత్యవాణి చెబుతున్నారు. కొందరు స్థానిక టీడీపీ నాయకులను కలిస్తే.. నీ ఇల్లు కబ్జా అయ్యిందమ్మా.. సెటిల్ చేసుకోమని సలహాలు ఇస్తున్నారని వాపోయింది. తాజాగా మూడురోజుల క్రితం రూ 1.50 లక్షలు ఇస్తే ఇళ్లు ఖాళీ చేస్తామని చెప్పి డబ్బులు తీసుకుని కొన్ని సామాన్లు తీసుకుని మళ్లీ అడ్డం తిరిగి రూ.5 లక్షలు డిమాండ్ చేయడమే కాకుండా తనపై కేసు పెట్టారన్నారు. దీంతో ఇంటికి తాళం వేసి మూడురోజులుగా కాపలా కూర్చుంటానని వాపోయారు. తీరంలో ఒంటరి మహిళలను టార్గె చేసుకుని రాజకీయ అండదండలతో కొన్ని ముఠాలు ఇస్టానుసారం కబ్జాల పర్వం సాగిస్తున్నారు. ఇళ్లలో అద్దెకు దిగి కబ్జాలు చేయడంతో పాటు దూరప్రాంతాల్లో స్థిరపడిన వారి ఖాళీ స్థలాలు ఆక్రమించడం, వివాదాల్లో ఉన్న భూములను అన్యాక్రాంతం చేసుకోవడం చేస్తున్నారు. ఈ వ్యవహారం మరింత ముదరక ముందే అధికారులు చర్యలు చేపడతారా? ఒత్తిళ్లకు తలొగ్గి ఊరుకుంటారా? అనేది వేచి చూడాలి.
ఒంటరి మహిళలే టార్గెట్గా ఇళ్లు కబ్జా


