గణపవరం: పిప్పరలో ఉండి పంట కాల్వలో ఈతకు దిగి గల్లంతైన ప్రమోద్వర్మ ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా జరుగుతుంది. ఆదివారం సాయంత్రం పిప్పర గ్రామానికి చెందిన భూపతిరాజు సుశాంతవర్మ(10), ఇందుకూరి ప్రమోద్వర్మ(11) సరదాగా ఈతకోసం కాల్వలోకి దిగి గల్లంతైన విషయం తెలిసిందే. చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో గ్రామంలో వెతికిన కుటుంబసభ్యులకు వీరు కాల్వలో ఈతకుదిగి మునిగిపోయిన విషయం తెలిసింది. వలలతో కాల్వలో గాలించగా సుశాంత్వర్మ మృతదేహం రాత్రి ప్రమాద ప్రదేశానికి కొద్దిదూరంలోనే లభించింది. ప్రమోద్వర్మ ఆచూకీ కోసం గాలించినా లభించలేదు. సోమవారం ఉదయం నుంచి గాలింపు కొనసాగిస్తున్నారు. గణపవరం ఎస్ఐ సంఘటనా స్థలంలో ఉండి గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు. యండగండి లాకులను మూసివేశారు. పిప్పరనుంచి దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల దూరం వరకూ గాలింపు కొనసాగుతుంది. ఉండి పంటకాల్వలో ఈతకు దిగి మృతిచెందిన, గల్లంతైన బాలుర కుటుంబ సభ్యులను ఉంగుటూరు ఎమ్మెల్యే పి.ధర్మరాజు సోమవారం పరామర్శించారు.


