నూజివీడు : మండలంలోని సుంకొల్లులో గృహ నిర్మాణాలకు సంబంధించిన అవకతవకల విషయంలో మండలంలోని పని చేస్తున్న ఐదుగురు వర్కు ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేసిన విషయమై ఎస్సీ కమిషన్ సభ్యులు సుంకొల్లులో విచారణ నిర్వహించారు. సస్పెండ్కు గురైన వర్క్ ఇన్స్పెక్టర్లు అవకతవకల్లో తమ పాత్ర లేకపోయినా అన్యాయంగా తమను తొలగించారని, తమకు న్యాయం చేయాలని ఎస్సీ కమిషనర్కు అర్జీ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల భిక్షం, ఆర్.సీతారామ్, పి.గౌతం సుంకొల్లు వచ్చి గృహనిర్మాణశాఖ అధికారులను విచారించారు. అయితే ఈ గ్రామంలో గతంలో పని చేసిన హౌసింగ్ అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు కలిసి 42 పాత గృహాలకు బిల్లులు చేసి రూ.59 లక్షల వరకు దుర్వినియోగం చేసినట్లు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు చేసిన విచారణలోనే తేలింది. ఈ నేపథ్యంలో విచారణకు వచ్చిన ఎస్సీ కమిషన్ సభ్యులు హౌసింగ్ ఈఈ రామోజీ నాయక్, పీడీ సత్యన్నారాయణలపై ప్రశ్నల వర్షం కురిపించారు. స్టీలు, సిమెంట్, ఇసుక కూపన్లు, బిల్లులు జనరేట్ చేసే అధికారం ఎవరికి ఉందంటూ ప్రశ్నించారు. తప్పంతా అధికారులు చేసి వర్క్ ఇన్స్పెక్టర్లను బలిపశువులను చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ విచారణకు గతంలో సుంకొల్లులో పని చేసిన గ్రామ సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గైర్హాజరవ్వడంపై కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


