ఎకరాకు రూ.లక్ష నష్ట పరిహారం అందేలా అంగీకారం
వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలోని చిగురుమామిడి గ్రామ సమీపంలో రైతుల పొలాల్లో కాపు కాయని మిర్చి పంటను ఉద్యాన వన శాస్త్రవేత్తలు బుధవారం పరిశీలించారు. గత ఏడాది అక్టోబర్లో భదాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన మహేష్ సీడ్స్ విత్తనాల దుకాణం యజమాని నుంచి విత్తనాలు కొనుగోలు చేశారు. చిగురుమామిడి, బోళ్ళపల్లి, ఎడవల్లి, నార్లవరం, తాట్కూరుగొమ్ము తదితర గ్రామాల రైతులు 70 ఎకరాల్లో ఈ రకం సాగు చేసి మునిగిపోయారు. గుంటూరులోని లామ్ఫామ్ ఉద్యాన వన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సీ, వెంకటరమణ, డాక్టర్ శిరీష పరిఽశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలు సేకరించారు. సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు శాస్ట్రవేత్తలు వెల్లడించారు. పంటల పరిశీలనకు వీరితో పాటు వచ్చిన మైసూర్లోని విత్తన కంపెనీ డైరెక్టర్ భాస్కరరెడ్డిని ఈ ప్రాంత రైతులు పురుగు మందు డబ్బాలు చేతబట్టి అడ్డగించారు. తమకు ఎకరాకు రెండు లక్షల నష్టపరిహారం అందించాలని ఆందోళనకు దిగారు. చివరకు మండల వైఎస్సార్సీపీ సీనియర్ నేత కామినేని వెంకటేశ్వరావు చొరవతో ఎకరాకు రూ.లక్ష పరిహారం ఇచ్చేలా డైరెక్టర్తో రైతుల సమక్షంలో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.


