తణుకు అర్బన్: తాళం వేసి ఉన్న ఇళ్లు గుల్ల చేసిన ఘటన తణుకు మండలం వేల్పూరులో చోటుచేసుకుంది. తణుకు మండలం వేల్పూరు పరిధిలోని విష్ణుప్రియ నగర్లోని ఇంట్లో జరిగిన చోరీ సోమవారం వెలుగు చూసింది. ఈ చోరీలో బంగారు నగలతోపాటు కిలో వెండి వస్తువులు, రూ.20 వేల నగదు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. విష్ణుప్రియ నగర్లోని 8వ నంబరు రోడ్డులో ఉంటున్న వరద వెంకటరమణ కుటుంబసభ్యులతో కలిసి ఇటీవల కాశీకి వెళ్లారు. సోమవారం ఉదయం ఇంటి తలుపు తెరిచి ఉండటంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో వారి కుటుంబ సభ్యులు తణుకు రూరల్ పోలీసులకు విషయం తెలపగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇంట్లోని రెండు బీరువాలను పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలతోపాటు రూ. 20 వేలు వరకు నగదును అపహరించుకుపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంటి యజమానులు వస్తేనే గానీ ఆభరణలు ఎన్ని ఉండాలి, ఎంత చోరీకి గురయ్యాయనే విషయం స్పష్టత రాదని తణుకు రూరల్ ఇన్చార్జ్ ఎస్సై జానా సతీష్ తెలిపారు.


