ఏలూరు(మెట్రో): జిల్లాలో ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన నిర్మాణ పనులు, బిల్లుల అప్లోడ్ పనులు ఈ నెల 15 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. పంచాయతీ రాజ్, ఉపాధి హామీ, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష, హౌసింగ్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, తదితర ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన నిర్మాణ పనుల ప్రగతిపై శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా జిల్లాలో ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన నిర్మాణ పనులు, బిల్లులు అప్లోడ్ పనులు ఈనెల 15 లోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఆక్వా సాగు చేసే చెరువులన్నీ ఏపి సడా చట్టం కింద నమోదు కావాలని కలెక్టర్ చెప్పారు. కలెక్టరేట్లో శుక్రవారం రెవెన్యూ, మత్స్య శాఖాధికారులతో సడా చట్టం అమలుపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 64,193 ఎకరాలు నమోదు చేయాల్సి ఉండగా, కేవలం 4693 ఎకరాలు మాత్రమే నమోదు కావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాస్ కాపీయింగ్ జరగకుండా నిఘా
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరగకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్థానిక అశోక్ నగర్లోని పీడీబీటీ కళాశాలలో శుక్రవారం ఇంటర్ పరీక్షల నిర్వహణను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా ఇన్విజిలేటర్లు పర్యవేక్షించాలన్నారు.


