
నూతన కార్మిక విధానానికి వ్యతిరేకంగా పోరాడాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): శ్రమ శక్తి పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన కార్మిక విధానాన్ని నిరసిస్తూ, రాష్ట్రంలో పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో నాయకులు రాష్ట్ర కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. పట్టణంలో రెండు రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు శనివారం స్థానిక సిపాయి పేటలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో జరిగాయి. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు డి.సోమసుందర్, జే.లలితమ్మ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఏఐటీయూసీ సమావేశాలలో 26 జిల్లాలకు చెందిన 47 మంది కార్మిక నేతలు, ప్రతినిధులు మాట్లాడారు. పనిని భారంగా మార్చడాన్ని నాయకులు తప్పు పట్టారు. నవంబర్ 26వ తేదీన దేశ వ్యాప్తంగా తలపెట్టిన నిరసన దినాన్ని రాష్ట్రంలో విజయవంతం చేస్తామని నాయకులు తెలిపారు. సమస్యలు పరిష్కారం కాకపోతే పవన్ కళ్యాణ్ కార్యాలయాన్ని ముట్టడించాలని వెల్లడించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతుండడంతో ఆయన స్థానంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్న ఎస్.వెంకట సుబ్బయ్యను ఇన్చార్జి జనరల్ సెక్రటరీగా నియమిస్తూ రాష్ట్ర కౌన్సిల్ తీర్మానాన్ని అమోదించారు.
ఏలూరు టౌన్: పొలానికి పురుగుల మందు కొట్టి ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఏలూరు జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. దెందులూరు మండలం జోగన్నపాలెం గ్రామానికి చెందిన పసుమర్తి లక్ష్మణరావు (35కు) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్ష్మణరావు శనివారం పొలంలో పురుగుల మందు కొట్టి ఇంటికి రాగా... తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడ్ని ఏలూరు జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మణరావు శనివారం రాత్రి మృతిచెందాడు. దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భీమవరం: ప్రమాదవశాత్తూ గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని భీమవరం వన్టౌన్ ఏఎస్సై చక్రవర్తి శనివారం తెలిపారు. ఈనెల 12న గునుపూడిలో నిర్వహించిన పెళ్లి విందులో కటికల సునీల్ కుమార్ (25) ప్రమాదవశాత్తూ వేడిగా ఉన్న సాంబారు గిన్నెలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. సునీల్కుమార్ భార్య నీలిమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చక్రవర్తి తెలిపారు.