
కొల్లేరు తిప్పలు
● కొల్లేరు ముంపు బారిన పెనుమాకలంక రహదారి
● ప్రమాదం అంచున తప్పని ప్రయాణం
కై కలూరు: కొల్లేరు చుట్టూ నీరు ఉంది.. తాగడానికి చుక్క నీరు లేదు. పేరుకే పెనుమాకలంక రహదారి.. ఎగువ నుంచి కొల్లేరుకు నీరొస్తే కనిపించకుండా మునిగిపోతుంది. ఈ పరిస్థితులు కొల్లేరు దుర్భర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. మండవల్లి మండలం పెదఎడ్లగాడి వంతెన నుంచి పెనుమాకలంక, ఇంగిలిపాకలంక వెళ్లే రహదారి అనేక రోజులుగా నీటిలో నానుతూ, ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఇక్కడ రోడ్డుపై బాగా ఎక్కువ నీరు పారితే పడవలపై ప్రజలు వెళుతున్నారు. కాస్త తగ్గితే ద్విచక్రవాహానాలతో పడుతూ లేస్తూ ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. కొత్త వ్యక్తులు ఏ మాత్రం పట్టుతప్పిన కొల్లేరులో మునిగిపోవడం ఖాయం.
కలెక్టర్కు ఫిర్యాదు..
పెనుమాకలంక రహదారి నీటిలో మునగడంపై కలెక్టర్ వెట్రిసెల్వికి సోమవారం ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదికలో కొందరు ఫిర్యాదులు చేశారు. సుప్రీం కోర్టు అమలు చేస్తున్న 120 జీవో ప్రకారం అక్రమ చేపల సాగు అభయారణ్యంలో నిషిద్దం. పెనుమాకలంక రహదారిలో అక్రమ చెరువుల సాగు యథేచ్చగా సాగుతుంటే పట్టించుకోని ఫారెస్టు అధికారులు ప్రజలకు ఉపయోగపడే రహదారిని నిర్మించడానికి నిబంధనలు అడ్డుచెప్పడం ఏం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో వర్షాలు అధికంగా కురియడంతో వివిధ డ్రెయిన్ల ద్వారా వచ్చిన నీరు ఏలూరు–కై కలూరు రహదారిలో పెదఎడ్లగాడి ద్వారా కిందకు చేరాలి. వంతెన ఖానాల వద్ద గుర్రపుడెక్క పేరుకుపోవడంతో నీరు వెనక్కి మళ్లీ పెనుమాకలంక రహదారిని ముంచేత్తుతుంది. శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా కై కలూరు దానగూడెం దళితులకు, మరో సామాజికవర్గానికి మధ్య వినాయక నిమజ్జనం ఊరేగింపులో చోటుచేసుకున్న ఘర్షణపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బేతాళ సుదర్శనం ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్కు ఫిర్యాదు చేశారు. కొందరు యూట్యూబర్లు, ఇన్ఫ్లూయన్సర్లు ఇష్టారాజ్యంగా వీడియోలు, రీల్స్ చేస్తూ రెండు సామాజికవర్గాల మద్య విభేధాలు, విద్వేషాలు రగిలించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేయటాన్ని ఆయన తప్పుబట్టారు. ఎస్సీ, ఎస్టీలను అవమానించేలా, రెచ్చగొట్టేలా, వారి మనోభావాలను కించపరిచేలా సోషల్మీడియాలో పోస్ట్లు పెట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మేరకు కఠిన చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పును ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా యూట్యూబర్ల వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్కు అందజేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఏపీ మాల ఉద్యోగుల సంఘం ప్రతినిధులు బేతాళ నాగరాజు, టీఎన్డీవీ ప్రసాద్, ములగల బెన్హర్, బంటుమిల్లి కెనడీ, దండబత్తుల రవికుమార్ ఉన్నారు.
ఏలూరు టౌన్: గంజాయి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏలూరు వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ తెలిపారు. ఏలూరు రూరల్ పోలీస్స్టేషన్ ఇన్చార్జి ఎస్సై బి.నాగబాబు తన సిబ్బందితో సెప్టెంబర్ 29న సాయంత్రం 4.30గంటల సమయంలో ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించగా, ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా 2.396 కిలోల గంజాయి లభించడంతో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులు ఏలూరు 29వ డివిజన్ తాపీమేసీ్త్ర కాలనీకి చెందిన దుడ్డె ప్రశాంత్కుమార్, బీడీ కాలనీ ద్వారకానగర్కు చెందిన సిద్దాంతపు రాములపై కేసు నమోదు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారని తెలిపారు.
జంగారెడ్డిగూడెం: స్థానిక సాయి సౌజన్య నగర్లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటనపై కేసు నమోదైంది. రైటర్ పి.బాబురావు తెలిపిన వివరాల ప్రకారం పెండ్ర మోహనకృష్ణ ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబ సభ్యులతో సహా సెప్టెంబర్ 19న బుట్టాయగూడెం మండలం గంగవరం గ్రామం వెళ్లాడు. తిరిగి 29న ఇంటికి వచ్చి చూసే సరికి తలుపులు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి బీరువాలో ఉంచిన 60 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీనిపై మంగళవారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నుట్లు పోలీసులు చెప్పారు.

కొల్లేరు తిప్పలు