
పీహెచ్సీ వైద్యుల సమ్మె బాట
చలో విజయవాడకు సిద్ధం
ఏలూరు టౌన్: గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు వైద్య చికిత్సలు అందిస్తూ.. విశేష సేవలు చేస్తోన్న పీహెచ్సీ వైద్యుల పట్ల కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. గతేడాది ఇచ్చిన హామీలను మరిచి మరోసారి పీహెచ్సీ వైద్యులను దారుణంగా మోసం చేసింది. వైద్యుల సమస్యలను పరిష్కరించకపోగా పాత విధానాన్నే మళ్ళీ తెరపైకి తేవటంతో వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పీహెచ్సీ వైద్యులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తూ సమస్యలు పరిష్కారం కాకుంటే పూర్తిస్థాయిలో సమ్మెకు వెళ్తామని హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం ఏలూరు జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీలో వైద్యసేవలు నిలిపేశారు. అత్యవసర చికిత్సలకు మాత్రం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా పల్లెసీమల్లో పేద వర్గాల ప్రజలకు వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. ఎంతో శ్రమించి పీహెచ్సీల్లో వైద్య సేవలు అందిస్తోన్న డాక్టర్ల పట్ల సర్కారు నిరంకుశ వైఖరితో వైద్యులంతా ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులంతా ప్రభుత్వ అధికారిక గ్రూపుల నుంచి బయటకొచ్చారు. ఆన్లైన్ రిపోర్టింగ్, 104 సేవలు నిలిచిపోయాయి. సోమవారం నుంచి ఏలూరు జిల్లా వ్యాప్తంగా 62 పీహెచ్సీల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. కేవలం అత్యవసర చికిత్సలకు మాత్రమే మినహాయింపునిచ్చారు. నల్లబ్యాడ్జీలు ధరించిన వైద్యులు ఎమర్జెన్సీ సేవలను కొనసాగించారు.
మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఏలూరులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమానికి సిద్దపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 110 మంది పీహెచ్సీ వైద్యులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని ఏపీ పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ భవానీ తెలిపారు. పీహెచ్సీ వైద్యుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.
కూటమి సర్కారు మోసం
ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో భారీగా హామీలు గుప్పించి మోసం చేసిన కూటమి సర్కారుకు.. మోసాలు చేయటం వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. గతంలో పీహెచ్సీ వైద్యులకు పీజీ సీట్ల కేటాయింపులో 30 శాతం రాయితీ కల్పించేవారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం పీజీ సీట్లలో కేటాయింపుల్లో సగానికి కోత వేసి 15 శాతానికి తగ్గించింది. దీనిపై గతేడాది పీహెచ్సీ వైద్యులు తీవ్రస్థాయిలో ఆందోళనలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేయగా.. 20 శాతం కేటాయిస్తామంటూ హామీ ఇచ్చింది ప్రభుత్వం. పీహెచ్సీ వైద్యుల పలు న్యాయమైన డిమాండ్లను సైతం పరిష్కరిస్తామంటూ నమ్మించారు. మరోసారి పీహెచ్సీ వైద్యులను మోసం చేస్తూ పాత విధానంలోనే 15 శాతం కేటాయింపులు చేస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తోన్న పీహెచ్సీ వైద్యులకు పదోన్నతులు కల్పించకపోవడంతో ఉద్యోగ విరమణ చేసే వరకూ కేవలం మెడికల్ ఆఫీసర్స్గానే ఉండిపోతున్నారు. టైమ్ బాండ్ ప్రమోషన్లు కల్పించాలని వారంతా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
నల్లబ్యాడ్జీలు ధరించి అత్యవసర సేవలను కొనసాగిస్తున్న పీహెచ్సీ వైద్యులు
డీఎంహెచ్వో కార్యాలయం వద్ద ఆందోళనలో పీహెచ్సీ వైద్యులు (గతేడాది)
రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్సీ వైద్యుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. పీహెచ్సీ వైద్యుల న్యాయమైన డిమాండ్లను సాధించేవరకూ ఆందోళన విరమించేది లేదు. ఓపీ సేవలను ఇప్పటికే నిలిపేశాం. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చాం. మంగళవారం ఏలూరు డీఎంహెచ్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అక్టోబర్ 3న ఛలో విజయవాడకు పిలుపునిచ్చాం. పీజీ సీట్లలో కోటాను తగ్గించటం సరైన విధానం కాదు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తోన్న వైద్యులకు బేసిక్ పేపై 50 శాతం అలవెన్సులు మంజూరుకు ఎప్పటి నుంచో అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.
– డాక్టర్ జ్ఞానేష్, ఏపీ పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ
కూటమి సర్కారు తీరుతో అసంతృప్తి
దశలవారీగా నిలిచిపోనున్న వైద్యసేవలు
అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు
నేడు ఏలూరు డీఎంహెచ్వో కార్యాలయం వద్ద ఆందోళన

పీహెచ్సీ వైద్యుల సమ్మె బాట

పీహెచ్సీ వైద్యుల సమ్మె బాట