
రామిలేరులో గల్లంతైన యువతి మృతదేహం లభ్యం
నూజివీడు: రామిలేరులో గల్లంతైన తుక్కులూరు దళితవాడకు చెందిన బడిపాటి నీరజ(20) మృతదేహం సోమవారం లభ్యమైంది. ఆదివారం చర్చికి వెళ్లి తిరిగి వస్తూ తుక్కులూరు, మర్రికుంటల మధ్యలో రామిలేరుపై ఉన్న లోలెవెల్ కాజ్వేను దాటుతూ వరద ఉద్ధృతిలో ఆమె కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం రామిలేరు వాగులో సోమవారం ఉదయం గాలించగా ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో మృతదేహం లభ్యమైంది. నూజివీడు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నీరజ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాలింపు చర్యలను తహసీల్దార్ గుగులోతు బద్రూనాయక్ పర్యవేక్షించారు.
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో సోమవారం ఇంజినీర్స్ డే ను నిర్వహించారు. దీనిలో భాగంగా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏఓ బీ లక్ష్మణరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరాయ పాత్ర వెలకట్టలేనిదన్నారు. దేశంలోని అనేక నదులపై ఆనకట్టలు, వంతెనలు నిర్మించి నీటి పారుదల రంగంలో విశేష అభివృద్ధికి కారణమయ్యారన్నారు. దేశం గర్వించదగ్గ సుప్రసిద్ధ ఇంజినీర్ మోక్షంగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకొని సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు. అనంతరం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, డీఎస్డబ్ల్యూఓ రాజేష్, సివిల్ హెచ్ఓడీ సునీల్భగత్, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానంలోని లీజెస్ విభాగంలో అవకతవకలకు పాల్పడిన రికార్డ్ అసిస్టెంట్ అనుమంచిపల్లి సాయి రామానుజన్ను సస్పెండ్ చేస్తూ ఆలయ ఈఓ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ద్వారకాతిరుమల మండలంలోని దేవినేనివారిగూడెంకు చెందిన జూనుపూడి సిద్ధయ్య స్థానిక టీటీడీ కాంప్లెక్స్ లోని 11 వ నెంబర్ షాపును దేవస్థానం నుంచి బహిరంగ వేలం ద్వారా లీజుకు తీసుకుని, అందులో ఫొటో స్టూడియో నడుపుతున్నాడు. అద్దె సొమ్ము రూ.58 వేలు చెల్లించాల్సి ఉండగా, గతనెల 6న రూ.51 వేలను లీజెస్ విభాగం రికార్డ్ అసిస్టెంట్ రామానుజన్కు ఇచ్చాడు. అతడు దేవస్థానానికి మరుసటి రోజు రూ. 42 వేలను జమ చేసి, రూ.9 వేలను పక్కదారి పట్టించాడు. సిద్ధయ్యకు రసీదును కూడా ఇవ్వలేదు. లీజెస్ విభాగం ఏఈఓ ఐనంపూడి రమణరాజు షాపు నిర్వాహకుడు సిద్ధయ్యకు మూడు రోజుల క్రితం ఫోన్చేసి బ్యాలెన్స్ అద్దె డబ్బులు రూ. 16 వేలను వెంటనే చెల్లించాలని సూచించారు. తాను సాయి రామానుజన్కు రూ.51 వేలు చెల్లించానని, మరో రూ. 7 వేలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పాడు. వెంటనే ఎమ్మార్లను పరిశీలించిన ఏఈఓ రమణరాజు పక్కదారి పట్టిన రూ.9 వేలను వెంటనే దేవస్థానానికి జమ చేయాలని ఉద్యోగిని హెచ్చరించారు. దాంతో సదరు ఉద్యోగి ఈనెల 14 న రూ.9 వేలను జమ చేశాడు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో పాటు, సిద్ధయ్య సోమవారం ఫిర్యాదు చేయడంతో అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. ఉద్యోగి సాయి రామానుజన్పై సస్పెన్షన్ వేటు వేశారు.

రామిలేరులో గల్లంతైన యువతి మృతదేహం లభ్యం