
ఆగడాలు భరించలేకే హతమార్చా
కొడుకును చంపిన కేసులో తండ్రి వెల్లడి
జంగారెడ్డిగూడెం: కుమారుడిని హత్యచేసిన కేసులో తండ్రిని అరెస్టు చేశారు. గురువారం జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ యు.రవిచంద్ర వివరాలు వెల్లడించారు. సీతంపేటకు చెందిన కొప్పుల నాగేశ్వరరావు చికెన్షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు కాగా, మృతుడు పవన్కుమార్ (24) పెద్ద కుమారుడు. డిగ్రీ చదువు మధ్యలో మానివేసి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ప్రతిరోజు తాగి వచ్చి ఆస్తి ఇవ్వాలంటూ తండ్రి, కుటుంబసభ్యులతో గొడవ పడుతూ, 9 నెలల క్రితం హైదరాబాద్ వెళ్లిపోయాడు. మరలా తిరిగి వచ్చి డబ్బులు కావాలని, లేకపోతే తన ఆస్తి తనకివ్వాలని గొడవ పడేవాడు. ఈ క్రమంలో పవన్కుమార్ తండ్రి నాగేశ్వరరావుపై దాడి చేశాడు. దీంతో విసిగిపోయిన నాగేశ్వరరావు ఈ నెల 26న వీరన్నగుడెం గ్రామంలోని నరసయ్య చెరువు గట్టుపై తన స్నేహితుడుకి చెందిన తాటాకింటికి పవన్కుమార్ను తీసుకువెళ్లి మద్యం పట్టించి మత్తులో గొంతు కోసి హత్య చేసి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన సీఐ వి.కృష్ణబాబును, ఎస్సై షేక్ జబీర్ను, ఏఎస్సై ఎన్వీ సందప్కుమార్, పీసీలు రమేష్, దిలీప్లను డీఎస్పీ అభినందించారు. రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు.